TS Minister KTR | వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఐదు విప్లవాలను సాధించడంతోనే అనతికాలంలో తెలంగాణ ప్రగతి సాధ్యమైందని రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణ మోడల్ అనుసరిస్తే ఇండియాకు తిరుగు ఉండదన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. లండన్లో జరిగిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో పాల్గొన్నారు. తొమ్మిదేండ్ల తెలంగాణ విజయగాథను ఉద్వేగభరితంగా వివరించారు. ఉపాధి కల్పన, ఔత్సాహిక పారిశ్రామిక రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చేకునేలా యువతను తయారుచేసినప్పుడే మనదేశ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
`భారత్కు అనేక సహజ అనుకూలతలు ఉన్నాయి. దేశంలో సమృద్ధిగా సహజ వనరులు, ఖనిజాలతోపాటు తగినంత కరెంట్ ఉత్పత్తికి అవసరమైన వనరులు ఉన్నాయి. దేశంలో ఉన్న నదులు, సరస్సులు, నీటి వనరులతో వ్యవసాయ భూములకు కావాల్సినంత సాగునీరు ఇవ్వడంతో పాటు ప్రజలందరికి తాగునీరు, పారిశ్రామిక రంగానికి అవసరమైన నీళ్లు సరఫరా చేయవచ్చు. వీటన్నింటికన్న ముఖ్యంగా సాటిలేని మానవ వనరులు మనదేశంలో ఉన్నాయి` అని కేటీఆర్ అన్నారు.
మానవ జాతి చరిత్రలో ఇప్పటివరకు ఏ దేశానికి లభించని గొప్ప అవకాశం మనదేశానికి మాత్రమే దొరికిందని కేటీఆర్ తెలిపారు. దేశ జనాభాలో 67% మంది పనిచేసే వయసు వారే అన్నారు. జనాభాలో అత్యధికంగా ఉన్న యువ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే సరైన ప్రణాళికలు, సమర్థవంతమైన కార్యాచరణను అమలుచేస్తే 30 ఏళ్లలో చైనా సాధించిన ప్రగతిని, 20 ఏళ్లలోపే ఇండియా సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. `భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను సృష్టించేలా యువతకు శిక్షణ ఇవ్వాలి. ఉపాధి, వ్యవస్థాపక రంగాల్లో అనేక అవకాశాలను వారికి అందించాలి` అని మంత్రి కేటీఆర్ అన్నారు.
భారతదేశ విజయవంత స్టార్టప్ రాష్ట్రం-తెలంగాణ విజయగాథను వివరించిన మంత్రి కేటీఆర్, కేవలం తొమ్మిదేండ్లలోనే విప్లవాత్మక ప్రగతితో అగ్రగామి రాష్ట్రంగా మారిందన్నారు. వ్యవస్థాగత సమస్యలను పరిష్కారంతోనే ఆయా రంగాల్లో విప్లవాత్మక మార్పును సాధించామన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిన విధానంతో పాటు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఐదు విప్లవాలకు నాంది పలికిన తీరును మంత్రి కేటీఆర్ వివరించారు.
“ఒకప్పుడు తెలంగాణ ను ఎడారి ప్రాంతంగా భావించేవారు. గ్రామాల్లోని సరస్సులు, ట్యాంకులు ఎండిపోయేవి. సాగు కోసం రైతులు అనేక బోరు బావులు తవ్వారు. ఆర్థిక భారంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు. తాగడానికి మంచినీళ్లు లేక కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఫ్లోరోసిస్తో బాధపడేవారు. కాని ఇప్పుడు తెలంగాణ పచ్చని రాష్ట్రంగా మారింది. ఇక్కడ ఒక రైతు సంవత్సరానికి రెండు పంటలు పండిస్తున్నాడు. సాగునీరు, రైతు సంక్షేమం, ఇతర సంస్కరణల్లో బీఆర్ఎస్ చేసిన పనులతోనే తెలంగాణ ఐదు విప్లవాలకు నాంది పలికింది` అని మంత్రి కేటీఆర్ చెప్పారు.
విద్యుత్, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక రంగాలలో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వినూత్న విధానాలు, ప్రత్యేక పథకాలను కూడా మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ఆయా రంగాల్లో సాధించిన విజయాలను ఎత్తిచూపారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ ఉందన్న కేటీఆర్, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినంక మన తలసరి ఆదాయం 2.5 రెట్లు పెరిగిందన్నారు. 2.5% జనాభా ఉన్న రాష్ట్రానికి భారతదేశ జీడీపీలో 5% వాటా ఉంటుందన్నారు. అంత్జాతీయ దిగ్గజ టెక్ కంపెనీలకు హైదరాబాద్ నిలయమన్న కేటీఆర్.. వినూత్న ఆవిష్కరణలకు కేంద్రమన్నారు.
`మేము ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ-హబ్తో పాటు భారతదేశపు అతిపెద్ద నమూనా కేంద్రం టీ-వర్క్స్, భారతదేశపు మొట్టమొదటి మహిళా పారిశ్రామికవేత్త ఇంక్యుబేటర్ వీ-హబ్, గ్రామీణ ఆవిష్కర్తలకు సహాయం చేయడానికి టీఎస్ఐసీ, యువతకు దిశానిర్దేశం చేసే అతిపెద్ద శిక్షణా కేంద్రం (టాస్క్) ఏర్పాటుచేశాం. మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక అనుకూల వాతావరణం కల్పిస్తున్నా.. పర్యావరణం పట్ల ఉన్న నిబద్ధతను మాత్రం కోల్పోలేదు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. మానవ చరిత్రలో అతిపెద్ద హరిత కార్యక్రమాలలో ఒకటైన హరితహారం కార్యక్రమం చేపట్టాం. 24 బిలియన్ల మొక్కలు నాటాం. ఒక రాష్ట్రంగా, మేము భారత్లో అత్యధిక గ్రీన్ కవర్ వృద్ధిని 7శాతం సాధించాం` అని కేటీఆర్ అన్నారు.
ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యూగో ఫేమస్ కొటేషన్ ‘సమయం వచ్చిందనే ఆలోచన కంటే శక్తివంతం ఏదీ లేదు` అన్న ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యోగో కొటేషన్ను కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ మోడల్ సమయం వచ్చిందన్నారు. తెలంగాణా మాదిరిగానే భారత్లోని వ్యవస్థాగత సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. నూతనోత్సాహంతో కూడిన భవిష్యత్ సృష్టిస్తూ, నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్ను అగ్రగామిగా తీర్చిదిద్దుతూనే రైతు, యువతపై దృష్టి సారించాలన్నారు.
సరైన ప్రణాళిక, అంకితభావంతో పనిచేస్తే వచ్చే 20 ఏళ్లలో భారతదేశం తలసరి ఆదాయాన్ని ఆరు నుంచి ఎనిమిది రెట్లు పెంచవచ్చునని కేటీఆర్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా ఇండియా అవతరించే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.