హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): దేశానికి ‘చంద్రయాన్’ సైన్స్ కంటే తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు లాంటి నాయకుల విజన్ (దార్శనికత) ఎంతో అవసరమని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి అభిప్రాయపడ్డారు. 2020లో ఒడిశా, రాజస్థాన్ లాంటి పలు రాష్ర్టాలతోపాటు బుందేల్ఖండ్, రాయలసీమ ప్రాంతాలు కరువుతో అల్లాడినప్పటికీ తెలంగాణలో కరువు ఛాయలే లేవని గుర్తుచేశారు. ఆ ఏడాది తెలంగాణ అధిక పంటలను ఉత్పత్తి చేసి తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని తెలిపారు. ఇది చంద్రయాన్ సైన్స్తో సాధ్యం కాలేదని, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్రావు ఫార్ములాతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఎంపీ సురేశ్రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు గానూ ప్రత్యేకంగా ఉప ప్రధాని పదవిని ఏర్పాటు చేయాలని, వ్యవసాయ సంబంధిత శాఖలను ఉప ప్రధానికి అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. వ్యవసాయం, అన్నదాతల అంశానికి సంబంధించిన ఏ ఫైలైనా ప్రస్తుతం ఐదు శాఖల వద్దకు వెళ్లాల్సి వస్తున్నదని, ఆ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా డిప్యూటీ ప్రధాన మంత్రి పదవిని సృష్టించాలని, తద్వారా రైతులకు సంబంధించిన ఏ సమస్య అయినా రెండు నిమిషాల్లో పరిష్కారం అవుతుందన్న నమ్మకం కల్పించాలని కోరారు. రబీలో వరి సాగు చేయవద్దని, ఖరీఫ్ రాగానే వరి సాగు చేయాలని చెప్పడం దారుణమని పేర్కొంటూ.. వ్యవసాయమేమి స్విగ్గీ సర్వీసు కాదని ఎద్దేవా చేశారు.
నీతి ఆయోగ్ను బలోపేతం చేయాలి..
దేశ అభివృద్ధి కోసం నీతి ఆయోగ్ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని ఎంపీ సురేశ్రెడ్డి ఉద్ఘాటించారు. గతంలో ఉన్న ప్రణాళికా సంఘం మాదిరిగా నీతి ఆయోగ్ పని చేయడం లేదని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నీతి ఆయోగ్ను ఎవరికీ నమ్మకం లేని సంస్థగా తయారు చేసిందని విమర్శించారు. తెలంగాణలో మిషన్ భగీరథ పథకానికి రూ.5 వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ ప్రతిపాదనను కేంద్రం అమలు చేయకపోవడమే ఇందుకు ప్రబల నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ను పటిష్ఠపర్చడంతోపాటు జిల్లాల స్థాయిలో ప్రణాళికా సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయికి ప్రణాళికా సంఘాలను అనుసంధానించడం ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
పార్లమెంట్ పనితీరు విచారకరం..
ప్రస్తుతం పార్లమెంట్ పనితీరు తీవ్ర విచారాన్ని కలిగిస్తున్నదని ఎంపీ సురేశ్రెడ్డి పేర్కొంటూ.. ప్రజల అవసరాలు, ఆకాంక్షల మేరకు చట్టసభలను నిర్వహించాలని కోరారు. గత ఐదేండ్లల్లో కేవలం 130 రోజులు మాత్రమే పార్లమెంట్ సమావేశాలు జరిగాయని, 2023 బడ్జెట్ సెషన్లో ఎలాంటి చర్చ లేకుండానే కేంద్రం 75% బిల్లులను ఆమోదించుకున్నదని, 2023 వర్షాకాల సమావేశాల్లో కేవలం 43%సభా సమయాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకోగలిగామని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ప్రాంతీయపార్టీల ప్రాతినిధ్యం పెరుగుతున్నందున అందరికీ అవకాశమివ్వాలని సూచించారు. పార్లమెంట్ పనిదినాలను పెంచడంతోపాటు ఎజెండా రూపకల్పనలో ప్రతిపక్షాలకూ అవకాశం కల్పించాలని, అన్ని అంశాలపై సమగ్ర చర్చకు వీలు కల్పించాలని కోరారు. గతంలో సభ్యుల ప్రైవేట్ బిల్లులను పార్లమెంట్లో అంగీకరించేవారని, ఇకనైనా ఆ పద్ధతిని పునరుద్ధరించి ప్రైవేట్ బిల్లులపై చిత్తశుద్ధితో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. 16వ లోక్సభలో 25% బిల్లులు, 17వ లోక్సభలో 14 బిల్లులను మాత్రమే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల పరిశీలనకు పంపారని, 14, 15 లోక్సభలతో పోల్చితే ఇది చాలా తక్కువని తెలిపారు. వాటిలో చాలా బిల్లులు పాస్ అయినా కార్యరూపం దాల్చడంలేదని అసహనం వ్యక్తంచేశారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును అష్యూరెన్సెస్ కమిటీకి పంపాలి
ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించి 10 ఏండ్లు గడుస్తున్నా అందులోని చాలా హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఎంపీ సురేశ్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆ బిల్లులోని హామీల అమలుకు నిర్దేశించిన 10 ఏండ్ల గడువు ఈ ఏడాదితో పూర్తవుతుందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లును అష్యూరెన్సెస్ కమిటీకి పంపించాలని కోరారు. గడువులోగా హామీలు అమలు కాకపోతే అదే బిల్లును మళ్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే ఆ బిల్లుకు విలువ, పార్లమెంట్పై ప్రజలకు నమ్మకం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించే అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటుకు సంబంధించిన కేసులను పరిష్కరించేందుకు ప్రస్తుతం ఎలాంటి వ్యవస్థ లేదని, దీనిపై రాజ్యసభలో విస్తృత చర్చజరగాలని ఎంపీ సురేశ్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లో సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలి..
దక్షిణ భారతావనిలో సుప్రీంకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని, అందుకు హైదరాబాద్ను పరిశీలించాలని ఎంపీ సురేశ్రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హిందీ భాషను బలవంతంగా రుద్దొద్దని కోరారు. మణిపూర్ అంశంపై రాష్ట్రపతి ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగిస్తే అక్కడి ప్రజలకు భరోసా లభించేదని, కానీ ఆ అవకాశాన్ని వదులుకోవడం విచారకరమని తెలిపారు. గతంలో ఏపీ అభివృద్ధిపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రసంగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.