హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం మన దేశంలోని కంపెనీలకు, ముఖ్యంగా ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్లోని కంపెనీలకు వరంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొవిడ్ సంక్షోభంతో ఇప్పటికే రెండేండ్ల నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటున్న తూర్పు యూరప్ దేశాల్లో తాజాగా యుద్ధం వల్ల ఐటీ విస్తరణకు బ్రేకులు పడ్డాయి. దీంతో ఆయా దేశాలు ఐటీ దిగుమతుల కోసం మన దేశంపై మరింతగా ఆధారపడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
చైనాలో అవకాశాలు ఉన్నప్పటికీ ఆ దేశాన్ని నమ్మే పరిస్థితి లేదు. దీన్ని హైదరాబాద్, బెంగళూరు, పుణె తదితర నగరాల్లోని ఐటీ సంస్థలు సానుకూలంగా మలుచుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి జరుగుతున్న ఐటీ ఎగుమతుల్లో దాదాపు 60% అమెరికాకే వెళ్తున్నాయి. యూరోపియన్ దేశాలకు 25-27% ఎగుమతులు జరుగుతున్నాయి. ఐటీ సర్వీస్ ప్రొవైడర్లకు అమెరికా తర్వాత బ్రిటన్ అతిపెద్ద మార్కెట్గా ఉన్నది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఐటీ కంపెనీలు తూర్పు యూరప్లో పెట్టుబడులను నిలిపివేసి, సమీప కాలంలో భారత్కు మరిన్ని ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి భారత ఐటీ కంపెనీలు ఇప్పటికే తూర్పు యూరప్ దేశాలకు విస్తరించాయి. పోలండ్, హంగరీ, రొమేనియా, బల్గేరియా, లిథువేనియా, క్రొయేషియా తదితర దేశాల్లో మన ఐటీ కంపెనీలు సేవలందిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో హెచ్సీఎల్ టెక్ 42.5 మిలియన్ డాలర్లతో హంగేరియన్ డాటా ఇంజినీరింగ్ సంస్థ ‘స్టార్సీమా’ను సొంతం చేసుకొన్నది. ఈ సంస్థ సమీప దేశాలకు ఐటీ సేవలను అందిస్తున్నది.
ప్రస్తుత సంక్షోభ సమయంలో అక్కడ ఐటీ నిపుణులకు కూడా కొరత ఏర్పడే అవకాశమున్నదని, నైపుణ్యంగల మ్యాన్పవర్కు కొరతలేని భారతీయ ఐటీ కంపెనీలకు ఇది కలిసొచ్చే అంశమని ఎవరెస్ట్ గ్రూప్ సీఈవో పీటర్ బెండోర్ శామ్యూల్ పేర్కొన్నారు. మధ్య, తూర్పు ఐరోపాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సంస్థ యుద్ధం కారణంగా తమ వ్యాపార కొనసాగింపు, డాటా భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు హెచ్ఎఫ్ఎస్ రిసెర్చ్ సీఈవో ఫిల్ ఫెర్ష్ అభిప్రాయపడ్డారు. యుద్ధం కారణంగా సమీప ప్రాంతాల్లోని క్లయింట్ల నుంచి కొత్త ఒప్పందాలు మందగించే అవకాశమున్నదని, ఇది కూడా భారతీయ కంపెనీలకు కలిసొస్తుందని పర్యక్ కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు పరీఖ్ జైన్ తెలిపారు. యుద్ధ ప్రభావిత దేశాల్లోని ఐటీ కంపెనీలు వేచిచూసే ధోరణిలో ఉన్నందున అక్కడ ఐటీ విస్తరణ నెమ్మదిస్తున్నదని, ఇది భారత కంపెనీలకు సానుకూల పరిణామమని సీఐఈఎల్ హెచ్ఆర్ సేవల సీఈవో ఆదిత్య నారాయణ మిశ్రా పేర్కొన్నారు.
సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్కు అధిక డిమాండ్
యుద్ధం కారణంగా డాటా రక్షణకు విఘాతం కలగటంతో సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్కు డిమాండ్ ఏర్పడింది. దీంతో సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్లో ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ ఐటీ కంపెనీలకు భారీ గా ఆర్డర్లు వచ్చే వీలున్నది. ఫిన్లాండ్, నెదర్లాండ్, జర్మ నీ, స్విట్జర్లాండ్ తదితర దేశాల్లో భారత్ ఐటీ కంపెనీలు, ప్రత్యేకించి తెలుగు రాష్ర్టాలకు చెందిన ఐటీ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. యుద్ధం కారణంగా వారు తమ వ్యాపార విస్తరణకు హైదరాబాద్ను గమ్యస్థానంగా చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, ఇతర సానుకూలతలను దృష్టిలో పెట్టుకొని వారు కొంపల్లిలోని గేట్వే ఐటీ పార్కులో తమ కేంద్రాలను ఏర్పాటుచేసే యోచనలో ఉన్నారు.
– వెంకట్ ఓరుగంటి, కొంపల్లి, ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు