హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): నేటి అంకుర సంస్థలే రేపటి బహుళజాతి సంస్థలు అవుతాయని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. కష్టపడి పనిచేస్తే గొప్ప స్థాయికి ఎదగటం అసాధ్యమేమీ కాదని తెలిపారు. ఆవిష్కరణలో దేశానికి రోల్ మాడల్గా టీ హబ్ నిలిచిందని చెప్పారు. అత్యంత ప్రభావం చూపేలా స్టార్టప్లను మరింత ప్రోత్సహించాలని సూచించారు. టీ హబ్ 7వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాయిదుర్గం నాలెడ్జ్ సిటీలోని టీ హబ్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి శనివారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన 17 స్టార్టప్లకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సరికొత్త ఆవిష్కరణలే దేశాభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. అలాంటి స్టార్టప్లకు ప్రభుత్వమే మొదటి వినియోగదారుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అత్యుత్తమ ఆలోచనలతో ముందుకు వచ్చే స్టార్టప్లకు ప్రభుత్వమే కస్టమర్గా మారుతుందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగానికి, సరికొత్త ఆవిష్కరణలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలోనే అత్యుత్తమైన రీతిలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టీ హబ్ను ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలు జీఎస్డీపీ పెరుగుదలకు ఊతమిస్తాయని తెలిపారు. నూతన ఆవిష్కరణలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మరో నాలుగు శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ జీఎస్డీపీ రూ.11.55 లక్షల కోట్ల చేరుకోగా, నాలుగైదేండ్లలో రూ.30 లక్షల కోట్లకు పెరుగుతుందని చెప్పారు. హైదరాబాద్ను మరో సిలికాన్ వ్యాలీగా మారుస్తామని అన్నారు. ‘ప్రస్తుతం తెలంగాణలో ఆవిష్కరణలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. గ్రామీణ స్థాయి నుంచి, పాఠశాల నుంచి కూడా వినూత్న ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. స్టార్టప్లకు మంచి వాతావరణం ఉన్నది. ఆవిష్కరణల్లో మాకున్న నైపుణ్యాన్ని ఇతర రాష్ర్టాలకు అందిస్తున్నాం. గోవా ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. మరో 8 రాష్ర్టాల్లోనూ టీ హబ్ సేవలందిస్తున్నది. ప్రభుత్వంతోపాటు కార్పొరేట్ సంస్థలు సైతం టీహబ్తో కలిసి పనిచేస్తున్నాయి’ అని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు కలిసి ప్రోత్సహిస్తే స్టార్టప్లు రేపటి ఎంఎన్సీలుగా మారుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్, స్టార్టప్ నిపుణులు శ్రీనివాస్ కొల్లిపర, అను ఆచార్య, సుధీర్బాబు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో స్థాపించిన స్టార్టప్లలో వివిధ క్యాటగిరీల్లో 27 సంస్థలను అవార్డులకు ఎంపిక చేయగా, 17 సంస్థలకు మంత్రి కేటీఆర్ శనివారం అవార్డులు అందజేశారు. అవార్డులు పొందిన సంస్థల్లో ఇకిన్కేర్, సెల్లెస్టియల్ ఈ- మొబిలిటీ, టర్బోహైర్, స్మార్ట్ విన్నర్, పర్ఫెక్ట్ ఏ1, లెమ్మెబీ, మోనిట్ర, బ్లజ్, పర్సెప్టినె, స్కైరూట్ ఏరోస్పేస్, నీమాన్స్, రోడ్మెట్రిక్స్, స్టాన్ప్లస్, ఆన్వర్డ్ హెల్త్, పోర్టల్, ఏ క్రంచ్, మై మనీకర్మ, స్వాప్, అవర్ఫుడ్, బన్యన్ నేషన్, ఏవైరోస్, రోజ్గార్ కార్ట్, బ్లూకోపా, కన్స్ట్రక్షన్.ఏఐ, ఆర్ఏసీ ఎనర్జీ, ఎర్మిన్ ఆటోమేటివ్ ఉన్నాయి.