హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పర్యాటక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకుగాను మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు. రామప్ప ఆలయానికి యునెసో గుర్తింపు లభించడం, పోచంపల్లి గ్రామం బెస్ట్ టూరిజం విలేజ్గా ఎంపికకావడంతో రాష్ట్రానికి విదేశీ పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని చెప్పారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం మార్ట్లో వివిధ దేశాల పర్యాటక శాఖల టూరిజం ఇన్ఫర్మేషన్ స్టాళ్లను మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు ప్రత్యేక సంస్కృతీ సంప్రదాయాలు ఉన్నాయని చెప్పారు.
చరిత్ర, వారసత్వ సంపద, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు, సెలయేళ్లు, దేవాలయాలు, వైల్డ్, ఎకో, ట్రైబల్, మెడికల్ టూరిజం, గిరిజన సంస్కృతి, బతుకమ్మ పండుగలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.