హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్లు అంతా కంప్యూటర్సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)కోర్సు బాట పట్టారు. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా అదే ఒరవడి కనిపించింది. వెయ్యిలోపు ర్యాంకర్లంతా 9 ఐఐటీల్లో సీఎస్ఈ సీట్లు పొందారు. అందులో మన హైదరాబాద్ ఐఐటీ కూడా ఉన్నది. ఆ తర్వాత ర్యాంకర్లు మిగతా బ్రాంచిల్లో చేరారు. సీట్ల కేటాయింపు పరిశీలిస్తే.. తొలి 500 ర్యాంకర్లలో 173 మంది విద్యార్థులు ఐఐటీ బాంబేలో చేరారు. 127 మంది విద్యార్థులు ఐఐటీ ఢిల్లీలో ప్రవేశాలు పొందారు. ఐఐటీ మద్రాస్, కాన్పూర్, ఖరగ్పూర్లో గణనీయంగా విద్యార్థులు సీట్లు దక్కించుకొన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్లో టాప్ 500లోపు ర్యాంకుల్లో 9 మంది విద్యార్థులు, వెయ్యిలోపు ర్యాంకుల్లో 33 మంది విద్యార్థులు ఐఐటీ హైదరాబాద్లో చేరినట్టు ఐఐటీహెచ్ వర్గాలు వెల్లడించాయి. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీ ప్రక్రియను చేపట్టే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఇటీవలే మొదటి విడత సీట్లను కేటాయించింది. ఈ నెల 28న రెండో విడత సీట్ల కేటాయింపు నిర్వహిస్తారు.
పలు బ్రాంచిల్లో ఇలా..
సివిల్ ఇంజినీరింగ్లో ఐఐటీ హైదరాబాద్లో 6,080 ప్రారంభ ర్యాంకు కాగా, 7,763 ముగింపు ర్యాంకుగా ఉన్నది. ఐఐటీ మద్రాస్లో ప్రారంభ ర్యాంకు 4,224, ముగింపు ర్యాంకు 5,796, ఐఐటీ బాంబేలో ప్రారంభ ర్యాంకు 1,941, ముగింపు ర్యాంకు 3,418గా ఉన్నది. ఐఐటీ పాలక్కడ్, తిరుపతి, జమ్ములో మాత్రమే 10వేలకు పైగా ర్యాంకు వచ్చిన వారు సీటును దక్కించుకొన్నారు.
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో ఐఐటీ హైదరాబాద్లో ప్రారంభ ర్యాంకు 1,383 కాగా, ముగింపు ర్యాంకు 2,230గా ఉన్నది. ఐఐటీ బాంబేలో ప్రారంభ ర్యాంకు 103, ముగింపు ర్యాంకు 369, ఐఐటీ ఢిల్లీలో ప్రారంభ ర్యాంకు 358, ముగింపు ర్యాంకు 574, ఐఐటీ మద్రాస్లో ప్రారంభ ర్యాంకు 252, ముగింపు ర్యాంకు 985, ఐఐటీ ఖరగ్పూర్లో ప్రారంభ ర్యాంకు 1,028, ముగింపు ర్యాంకు 1,666గా ఉన్నది.
మెకానికల్ ఇంజినీరింగ్లో ఐఐటీ బాంబేలో 141 ప్రారంభ ర్యాంకు కాగా, 1,382 ముగింపు ర్యాంకుగా ఉన్నది. ఐఐటీ హైదరాబాద్లో ప్రారంభ ర్యాంకు 3,273, ముగింపు ర్యాంకు 4,747, ఐఐటీ మద్రాస్లో ప్రారంభ ర్యాంకు 8,27, ముగింపు ర్యాంకు 2,677, ఐఐటీ ఖరగ్పూర్లో ప్రారంభ ర్యాంకు 2,043, ముగింపు ర్యాంకు 3,097, ఐఐటీ రూర్కీలో ప్రారంభ ర్యాంకు 2,127, ముగింపు ర్యాంకు 3,685గా ఉన్నది.