జనగామ : పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా పాలకుర్తి మండలం శాతపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు వల్లెపు యాదగిరి, దర్దేపల్లి గ్రామానికి చెందిన యాదవ యూత్ అధ్యక్షుడు జే.రమేష్ అధ్వర్యంలో 20 మంది, దేవరుప్పుల మండలం, చిన్నమడూరు గ్రామానికి చెందిన వేణుగోపాల స్వామి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మొలుగురి గణేష్ అధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందన్నారు.