హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సాయిబాబా ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలి. అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా జరిగేలా విజయదశమిని జరుపుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు.
ఉప్పల్ చిలుక నగర్లో గల సాయిబాబా దేవాలయంలో స్వర్ణ సింహాసనాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. స్వామివారికి దాదాపు 80 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన బంగారు సింహాసనాన్ని ఆవిష్కరించడం నిజంగా అదృష్టమన్నారు.
దేవాలయ కమిటీ సభ్యులు తమ ఇంటి పనికంటే ఎక్కువగా భావించి చేయడం వల్లే అతి తక్కువ సమయంలో స్వామివారికి ఈ సింహాసనం తయారైందన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గీతా ప్రవీణ్ విజయం కోసం స్వామివారి ఆశీస్సులు తీసుకునే ప్రచారం ప్రారంభించామని, విజయం పొందామన్నారు. ఎంపీ సంతోష్ కుమార్చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దేవాలయ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్, దేవాలయ కమిటీ అధ్యక్షుడు మధుకర్ రెడ్డి, సభ్యులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.