Medical Student Preethi | సుబేదారి, జూన్ 7: కేఎంసీ వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్య కేసులో పోలీసులు బుధవారం కోర్టుకు చార్జ్షీట్ సమర్పించారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ అనస్తీషియా ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రీతి ఫిబ్రవరి 22న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అదే కళాశాలలో పీజీ అనస్తీషియా సెకండ్ ఇయర్ చదువుతున్న డాక్టర్ సైఫ్ వేధించడం వల్లే ప్రీతి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సైఫ్పై వరంగల్ మట్టెవాడ పోలీసుస్టేషన్లో ఐపీసీ 306, 354, ర్యాగింగ్ చట్టం కింద సెక్షన్3(1), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ పూర్తి విచారణ చేపట్టి సైఫ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు.. కేఎంసీ విద్యార్థులు, అధికారులు, ఎంజీఎం అధికారులు, నిందితుడు సైఫ్తో పాటు మొత్తం 70 మందిని విచారించారు. మృతురాలు ప్రీతి, నిందితుడు సైఫ్ సెల్ఫోన్ల కాల్డేటా, వాట్సాప్ చాట్ను పరిశీలించారు. సైంటిఫిక్, టెక్నికల్, మెడికల్, ఫోరెన్సిక్ నిఫుణుల సహకారంతో రిపోర్టులు సేకరించారు. ప్రీతిని నిందితుడు సైఫ్ కులం పేరుతో మానసికంగా ర్యాగింగ్ చేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు 70 మంది సాక్ష్యాధారాలతో 970 పేజీలతో చార్జ్షీట్ను రూపొందించి కోర్టుకు అందజేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.