హైదరాబాద్, అక్టోబర్12 (నమస్తే తెలంగాణ): గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో పనిచేసే వైద్యులకు పీజీ ప్రవేశాల్లో ఇన్ సర్వీస్ రిజర్వేషన్ల కోటా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో వారంలోపు వారికి ఇన్ సర్వీస్ కోటా అమలుకు వీలుగా వెబ్ ఆప్షన్లు ఎంచుకొనేందుకు చర్యలు చేపట్టాలని కాళోజీ వైద్య వర్సిటీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావుతో కూడిన ధర్మాసనం బుధవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది.
నిరుడు నవంబర్ 18న జారీ చేసిన జీవో 155 ప్రకారం గిరిజన ప్రాంతాల్లో రెండేండ్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడేండ్లు, ఇతర ప్రాంతాల్లో ఆరేండ్లు పనిచేసిన ప్రభుత్వ వైద్యులకు మెడికల్ పీజీ ప్రవేశాల్లో ఇన్ సర్వీస్ కోటా అమలు చేస్తామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు.