కీసర, జూన్ 22: వృద్ధాప్యంలోకి చేరిన తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసే కొడుకులున్న కాలమిది. వారు సంపాదించిన ఆస్తులను తీసుకొని.. పట్టెడన్నం పెట్టలేక నిర్ధాక్షిణ్యంగా రోడ్డుపై వదిలిపెడుతున్న లోకమిది. కానీ, అమ్మ లేని లోకంలో తాముండలేమంటూ తనువు చాలించారు ఇద్దరు కొడుకులు. తల్లి జ్ఞాపకాలను వీడలేక మనస్తాపంతో ఇంట్లోనే ఉరేసుకొని ఒకరు, పురుగుల మందు తాగి మరొకరు ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్నది. కీసర మం డలం రాంపల్లిదాయరకు చెందిన శ్రీనివాస్రెడ్డి, సుశీల దంపతులకు మాధవరెడ్డి, యాదిరెడ్డి (34), మహిపాల్రెడ్డి (29) సంతానం. శ్రీనివాస్రెడ్డి భార్యాపిల్లలను వదిలేసి మరో వివాహం చేసుకొని వెళ్లిపోయాడు.
అప్పటినుంచి సుశీల తన పిల్లలతో కలిసి రాంపల్లిదాయరలో ఉంటుంది. పెద్ద కొడుకు మాధవరెడ్డికి పెండ్లి కాగా అతని భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది. అతను గండిపేట్లో ఉంటూ అక్కడే ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. యాదిరెడ్డి, మహిపాల్రెడ్డిలు పియానో టీచర్లుగా ఉద్యోగం చేస్తూ దిల్సుఖ్నగర్లో ఉంటున్నా రు. కాగా, సుశీల క్యాన్సర్తో తొమ్మిది నెలల క్రితం మృతిచెందింది. తల్లి మరణంతో యాదిరెడ్డి, మహిపాల్రెడ్డి మానసికంగా కుంగిపోయారు. తల్లి మరణించాక ఇంటిని వదిలేశారు.
మంగళవారం ఆ ఇంటిని శుభ్రం చేసేందుకు వారు గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో అన్న మాధవరెడ్డి తమ్ముళ్లకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో పక్కిం టి వారికి ఫోన్ చేసి ఆరా తీశాడు. వారు కిటికీలో నుంచి చూడగా యాదిరెడ్డి ఫ్యాన్కు ఉరేసుకొని విగత జీవిగా వేలాడుతుండగా, మహిపాల్రెడ్డి పురుగుల మందు తాగి చనిపోయి ఉన్నాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. తల్లి మృతి తట్టుకోలేక మానసిక వ్యథతో ఆత్మహత్య చేసుకొంటున్నట్టు రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించారు.