హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): మనుషుల కదలికలు వన్యప్రాణులను ఆందోళనకు గురిచేస్తున్నాయా? వాటి మానసిక పరిస్థితిలో మార్పులు వస్తున్నాయా? స్వేచ్ఛగా విహరించే అవకాశం ఉన్న అభయారణ్యాల్లో పులుల సంఖ్య ఎందుకు వేగంగా పెరగడం లేదు? అడవుల్లో జన సంచారం, వేట వాటి పునరుత్పత్తిని ప్రభావితం చేస్తున్నాయా? అంటే నిజమేననీ పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
దేశంలోని రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర వంటి టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో అధ్యయనం చేసిన సీసీఎంబీ లాకోన్స్ (ల్యాబోరేటరీ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎన్డేంజరస్ స్పెసీస్) సంస్థ గుర్తించింది. పులుల విసర్జిత వ్యర్థాల్లో ఒత్తిడికి గురిచేసే హోర్మోన్ల అవశేషాలను గుర్తించారు. వాటి ఆధారంగా పరిశోధనలను ముమ్మరం చేస్తున్నారు. పులుల్లో ఒత్తిడి స్థాయి, ప్రభావిత అంశాలు, సంతానోత్పత్తి అంశాలను పరిశీలిస్తున్నారు. అభయారణ్యంలోని పులుల మనుగడను జన సంచారం ప్రభావితం చేస్తున్నది.
పులుల ఆవరణ వ్యవస్థలో కలుగుతున్న మార్పులపై సీసీఎంబీ లాకోన్స్ దేశంలోని రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి ప్రాంతాలను ఎంపిక చేసుకొని వాటి జీవనశైలిని పరిశీలిస్తున్నది. ఇప్పటికే ఎంపిక చేసిన టైగర్ రిజర్వ్ ప్రాజెక్టుల్లో పులుల మల విసర్జితాల శాంపిళ్లను సేకరించారు. ప్రత్యేక ఎక్విప్మెంట్ల సాయంతో పులుల ప్రవర్తనలను నిపుణులు రికార్డు చేస్తున్నారు. దేశంలోని అటవీ, అభయారణ్య ప్రాంతాల్లో వన్యప్రాణులపై వేటగాళ్ల దాడులు సాగుతూనే ఉన్నాయి. వన్యప్రాణుల జీవావరణం దెబ్బతినడంతో జనసంచార ప్రాంతాల్లోకి అవి వలసపోతున్నాయి. పర్యాటకం పేరిట అభయారణ్యాల్లో మనుషుల కదలికలు వన్యప్రాణులను ఆందోళనకు గురి చేస్తున్నట్టుగా అధ్యయనాల్లో వెల్లడైంది.
ఫలితాల ఆధారంగా తెలంగాణలో..
ఎంపిక చేసుకున్న అభయారణ్యంలోని పులుల విసర్జిత నమూనాలను లాకోన్స్ ప్రతినిధులు ఒక దఫా సేకరించారు. ప్రాథమికంగా వ్యర్థాల్లోని ఫికల్ గ్లూకోకార్టిసైడ్ మెటబాలైట్ ఆధారంగా ఒత్తిడి తీవ్రతను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ఫలితాలను బట్టి తెలంగాణలోని నల్లమల అడవుల్లోని అమ్రాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించిన కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టుల్లో అధ్యయనం చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అధ్యయన ఫలితాల ఆధారంగా నివేదిక రూపొందించడానికి మరో రెండు నెలలు పట్టనున్నది.
కాగజ్నగర్ రేంజ్లో పెద్దపులి సంచారం
కాగజ్నగర్, ఫిబ్రవరి 13 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో సోమవారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. సిర్పూర్ మండలం వేంపల్లి అటవీ ప్రాంతంలోని బొందల బ్రిడ్జి వద్ద పెద్దపులి సంచరిస్తుండగా.. అదే సమయంలో ఆ రూట్లో కారులో వెళ్తున్న ప్రయాణికులు సెల్ఫోన్లో ఫొటోలు తీశారు. పెద్దపులి కనిపించిన కొద్ది దూరంలోనే అటవీశాఖ అధికారులు విధుల్లో భాగంగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.