Heat Wave | హైదరాబాద్ : తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే పరిస్థితి ఆదివారం వరకు కొనసాగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమై కీలక ఆదేశాలు జారీ చేసింది.
మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లకూడదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తేలికైన కాటన్ దుస్తులు, తెలుపు రంగు దుస్తులు ధరించాలి. తలకు సూర్యరశ్మికి పడకుండా టోపీ, గొడుగు పెట్టుకోవాలి. గర్భిణులు, గుండె, బీపీ రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక బయటకు వెళ్లినప్పుడు వాటర్ వెంట తీసుకెళ్లాలి. నిమ్మరసం, ఓఆర్ఎస్ వంటి ద్రావణాలు తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా ఉంటుందని, వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 23 వరకు హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాల వల్ల ఉక్కపోత నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందన్నారు. ఈ రోజుల్లో కనిష్టంగా 25 నుంచి 28 డిగ్రీలు, గరిష్ఠంగా 37 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.