హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): ధనవంతులతో పోల్చితే పేదవారే ఎక్కువ సంతానాన్ని కంటున్నారట. సంతానం సంఖ్య మీద చదువు ప్రభావం కూడా ఎక్కువేనట. చదువుకున్న మహిళలతో పోల్చితే నిరక్షరాస్య మహిళలు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారట. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)-5 తాజాగా విడుదల చేసిన నివేదిక ఇలాంటి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సర్వేకు ముందు ఐదేండ్లతో పోల్చితే ఇప్పుడు 15-19 ఏండ్ల మధ్య వయసులో పిల్లలను కంటున్నవారి సంఖ్య సగానికి తగ్గింది. రెండు దశాబ్దాల కిందటి వరకు ముగ్గురు పిల్లలు ఉండాలని భావించేవారు. ఇప్పుడు అది ఇద్దరికే పరిమితమైందని సర్వేలో తేలింది.