హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న మూసీనది అభివృద్ధి ప్రాజెక్టులో.. జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్)తోపాటు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన భూములు కోల్పోయే ప్రమాదమున్నట్టు తెలుస్తున్నది. చిరుధాన్యాల పరిశోధన సంస్థకు చెందిన 10.38 ఎకరాలకు ఏప్రిల్ 30న ప్రభుత్వం మారింగ్ చేసింది. ఐఐఎంఆర్ భూములను సేకరించాలన్న రాష్ట్ర సర్కార్ నిర్ణయానికి అభ్యంతరం తెలుపుతూ సంస్థ డైరెక్టరేట్ కార్యాలయం మార్చి 4, మార్చి 25 తేదీల్లోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వానికి, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) ఎండీకి లేఖలు రాసింది. జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ చేపడుతున్న పరిశోధనలు, వాటి ప్రాధాన్యం, సంస్థ విశిష్టతను ఆ లేఖల్లో వివరించింది.
ఈ లేఖలకు జవాబు రాకముందే 10.38 ఎకరాల స్థలానికి మార్కింగ్ చేసినట్టు సమాచారం. దీనిపై మాట్లాడటానికి శాస్త్రవేత్తలు, సంస్థ సంచాలకులు పెదవి విప్పడం లేదు. మూసీనది అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐకార్-ఐఐఎంఆర్), ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములు కూడా కొంత మేర కోల్పోయే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. దేశ వ్యవసాయ రంగంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న రెండు పరిశోధన సంస్థల భూములకు ముప్పు వాటిల్లడం పట్ల శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో ఆహార, పౌష్టికాహార భద్రతకు ముప్పు వాటిల్లడం తథ్యం అని అంటున్నారు. వ్యవసాయ పరిశోధన భూములను సంరక్షించుకోవటం అవసరమని పేర్కొంటున్నారు. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశం మీద చిత్తశుద్ధితో ఒక ఆర్డినెన్స్ జారీచేయాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడుతున్నారు.
భారత వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ మంగీలాల్ జట్ హైదరాబాద్లోని జాతీయ వరి, చిరు ధాన్యాల పరిశోధనా సంస్థల ప్రగతిని పరిశీలించడానికి ఈ నెల 6న హైదరాబాద్ రానున్నారు. అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరాన్ని పురసరించుకుని జాతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థను గ్లోబల్ హబ్గా ప్రకటించి నిధులు మంజూరు చేయనున్నారు. త్వరలో ప్రధాని ఈహబ్ ప్రగతి అంచనాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా డైరెక్టర్ జనరల్ ఐకార్ పర్యటన చేస్తున్నారు.