హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ)ని ఏర్పాటు చేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఐఐహెచ్టీని ఏర్పాటు చేయాలని జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త, అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న ఇటీవల ప్రధానమంత్రికి లేఖ రాశారు. దీనిపై కేంద్ర టెక్స్టైల్స్శాఖ సహాయ సంచాలకులు అనితా సహానీ స్పందిస్తూ, ఒడిశాలోని ఐఐహెచ్టీలో తెలంగాణకు తొమ్మిది సీట్లు కేటాయించామని, ఆంధ్రప్రదేశ్లోని వెంకటగిరి ఐఐహెచ్టీలో కూడా తెలంగాణకు కోటా ఉన్నందున ప్రత్యేకంగా తెలంగాణకు ఐఐహెచ్టీ ఇవ్వలేమని వెంకన్నకు లేఖ రాశారు. తెలంగాణసహా దేశంలో ఎక్కడా కొత్తగా ఐఐహెచ్టీల ఏర్పాటు అవకాశం లేదని వెల్లడించారు.