హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ లబానీ రే.. ‘ఐజీయూ -అనీ తల్వానీ’ స్మారక పురస్కా రం అందుకొన్నారు. భూ అంతర్నిర్మాణం, జియోథర్మల్ మాడలింగ్ రంగంలో ఆమె చేసిన పరిశోధనలకు ఈ అవార్డు వరించింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అండ్ ఆప్లయిడ్ జియోఫిజిక్స్లో ఆమె ఎమ్మెస్సీ పూర్తిచేశారు. ఉస్మానియా వర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు.
అనంతరం ఎన్జీఆర్ఐలో సీనియర్ సైంటిస్టుగా పలు పరిశోధనలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద శిలల ఉష్ణ వాహకతను కొలవడానికి ఆమె ఎన్జీఆర్ఐలో ప్రత్యేక ల్యాబోరేటరీని ఏర్పాటు చేశారు. వెస్ట్రన్ హిమాలయాల్లో జలవిద్యుత్తు ప్రాజెక్టులలో ఇంజినీరింగ్ వ్యూహాల అభివృద్ధికి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్కు అవసరమైన సాంకేతిక, పరిశోధన సమాచారం అందించారు. అణు వ్యర్థ నిక్షేప స్థలాల అభివృద్ధికి బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్తో కలిసి పరిశోధన చేశారు. ఓఎన్జీసీ-ఏఈజీ ఉత్తమ పీహెచ్డీ థీసెస్ పురస్కారం, బాయ్స్కాస్ట్ ఫెలోషిప్ను కూడా డాక్టర్ లబానీ అందుకొన్నారు.