Gadwal | అయిజ, మార్చి 20: భూమి సమస్యను పరిష్కరించాలని ఐదుగురు బాధితులు తాసీల్దార్పై పెట్రోలు చల్లి.. తమపైనా పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బుధవారం జరిగిన ఈ భయానక ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ తాసీల్దార్ కార్యాలయంలో కలకలం రేపింది. అయిజ పట్టణానికి చెందిన రంగు రామేశ్వరమ్మ, సుభద్రమ్మ, గోవిందమ్మ, లక్ష్మీదేవి, రోహిణమ్మలు.. అయిజ మండలం బింగిదొడ్డి శివారులోని సర్వే నంబర్ 139లో ఉన్న భూమి సమస్యను పరిష్కరించాలని తాసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఆ సర్వే నంబర్లో ఉన్నది ప్రభుత్వ భూమి అని, అందులో రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని తాసీల్దార్ రైతుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా వినిపించుకోకుండా ఆ సర్వే నంబర్లో ఉన్న పదెకరాల భూమిని తమ పేరిట నమోదు చేయాలని పట్టుబట్టారు.
గతంలో ఏం జరిగిందో తనకు తెలియదని, 15 రోజుల కిందటే ఇక్కడికి వచ్చానని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తాసీల్దార్ వారికి నచ్చజెప్పారు. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన బాధితులు.. తమ వెంట బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్ను తాసీల్దార్పై చల్లడంతోపాటు తమపైనా పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది, ప్రజలు వారిని అడ్డుకుని పెట్రోల్ బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై విజయ్ భాస్కర్ బాధితులను పోలీస్స్టేషన్కు తరలించారు. తాసీల్దార్ జ్యోతి ఫిర్యాదు మేరకు బాధితులను విచారిస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్ సంతోష్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తాసీల్దార్ పేర్కొన్నారు.