హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర పరిసర ప్రాంతాలలో మరోసారి పాతరాతి యుగం నాటి రాతి గొడ్డలిని పురావస్తు పరిశోధకులు శనివారం గుర్తించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, సిరోంచ తాలుకాకు 19 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్, ఛత్తీస్గఢ్, జగదల్పూర్ను కలిపే జాతీయ రహదారి 63పై ఉన్న ‘వడధామ్ శిలాజాల తోట’ పక్కన ఉన్న ఒక చిన్న సెలయేటి ఒడ్డున కొత్త తెలంగాణ చరిత్ర బృందం చేసిన పరిశోధనల్లో పాత రాతి యుగం నాటి గొడ్డలిని గుర్తించారు. ఈ చేతి గొడ్డలి లక్ష సంవత్సరాల కిందటి రాతి పరకరమని పరిశోధన బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ఇలాంటివి ప్రాణహిత నది పరివాహక ప్రాంతాలలో సమృద్ధిగా కనిపిస్తాయని చెప్పారు. డైనోసార్ల అవశేషాలు, బండబారిన చెట్ల శిలాజాలున్న ప్రాంతంలో ఈ రాతిగొడ్డలి లభించడం విశేషమన్నారు.