వ్యాక్సిన్ మేధోహక్కుల్లో ఐసీఎంఆర్, ఎన్ఐవీకి వాటా
హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): కొవాగ్జిన్ టీకా అమ్మకాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్కు లాభాల్లో వాటా దక్కనున్నది. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో వ్యాక్సిన్ను అభివృద్ధిచేశాయి. ఈ మేరకు రెండు సంస్థలు గతంలోనే ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ, అమ్మకాల్లో ఐసీఎంఆర్కు రాయల్టీ హక్కు ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సైతం టీకా తయారీలో పాలుపంచుకొన్నది. అందుకే కొవాగ్జిన్ వయల్పై భారత్ బయోటెక్తోపాటు ఐసీఎంఆర్, ఎన్ఐవీ పేర్లు కూడా ఉంటాయి. టీకా అభివృద్ధి కోసం ఐసీఎంఆర్ ఎంత వెచ్చించిందో మాత్రం వెల్లడి కాలేదు. టీకా అభివృద్ధి మేధో హక్కుల్లో సైతం ఐసీఎంఆర్కు వాటా ఉన్నది. దేశీయంగా, అంతర్జాతీయంగా టీకాల అమ్మకాల్లో ఐసీఎంఆర్కు లాభాలు దక్కనున్నాయి. కేంద్రం ఇప్పటివరకు మొత్తం 11 కోట్ల కొవాగ్జిన్ డోసులకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో మార్చి వరకు 4 కోట్ల డోసులు వచ్చాయి. ఏప్రిల్లో 2 కోట్ల డోసులకు ఆర్డర్ ఇస్తే 88 లక్షలు డెలివరీ అయ్యాయి. మే, జూన్, జూలై నెలలకు సంబంధించి 5 కోట్ల డోసులకు కేంద్రం ఆర్డర్ ఇచ్చింది.