హైదరాబాద్ : వావిలాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటున్నాను. పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ధన వంతులు సైతం ఈ పాఠశాలకే వచ్చే విధంగా మార్చుకుందామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అలాగే ఈ స్కూల్ కి బస్సు సదుపాయాన్ని కల్పిస్తాం. ఇందుకు దాతలు సహకరించాలని మంత్రి కోరారు.
సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని నారబోయిన గూడెం, వావిలాల గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు చేశారు. నారబోయిన గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. సీసీ రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు. అలాగే వావిలాల గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, కేసీఆర్ పార్క్ ను, గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మన ఊరు మన బడి కింద రూ.90 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వావిలాల, నారబోయిన గూడెం గ్రామాలకి మంచి రోజులు వచ్చాయన్నారు. వావిలాల, ముత్తారం వంటి కొన్ని గ్రామాల చెరువులను త్వరలోనే నింపుతామన్నారు. పాలకుర్తిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవో కృష్ణవేణి, డీఆర్డీవో పీడీ రామ్ రెడ్డి, పంచాయతీ అధికారి రంగాచారి, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాసరావు, జెడ్పీ కోఅప్సన్ సభ్యుడు మదార్, రైతు సమితి మండల కోఆర్డినేటర్ యాకంతరావు, నారబోయిన గూడెం గ్రామ సర్పంచ్ మేడిద రజిత, ఎంపిటిసి నల్లపు మౌనిక, వావిలాల సర్పంచ్ గంట పద్మ, తదితరులు పాల్గొన్నారు.