Siddipet | హుస్నాబాద్, మే 5: నలుగురు కొడుకులున్నరు నాకేంటని మురిసిపోయాడు. సంపాదించిన ఆస్తిని నలుగురికి సమంగా పంచాడు. కొడుకులు, కోడండ్లు, మనుమలు, మనుమరాండ్లతో బతికినంత కాలం హాయిగా జీవించవచ్చని భావించాడు. కానీ, చివరి దశలో నలుగురి ఇంట్లో ఒక్కో నెల వంతులవారీగా ఉండాలనే నిబంధన ఆ వృద్ధుడి గుండె ధైర్యాన్ని దెబ్బతీసింది. ఈసడింపులు, నిరాదరణ తీవ్ర మనస్తాపం కలిగించాయి. సొంతూరిని విడిచి వెళ్లలేక జీవితంపై విరక్తి కలిగింది. ఎవరికీ భారం కాకూడదనుకున్నాడో.. ఏమో ఊరి చివర చితి పేర్చుకొని నిప్పంటించుకొని అందులోకి దూకాడు. 90 ఏండ్ల వృద్ధుడు తన చితిని తానే పేర్చుకొని ఆత్మాహుతికి పాల్పడిన ఘటన ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది.
ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో గురువారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన మెడబోయిన వెంకటయ్య (90)కు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరికీ వివాహాలు చేశాడు. తనకున్న నాలుగు ఎకరాల భూమి నలుగురు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చాడు. భార్య ఈరవ్వ 30 ఏండ్ల క్రితం చనిపోయింది. కొడుకులు ఒక్కో చోట స్థిరపడ్డారు. పొట్లపల్లిలో ఇద్దరు, హుస్నాబాద్లో ఒకరు, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో మరొకరు స్థిరపడ్డారు. వెంకటయ్యకు ఉన్న పది గుంటల భూమి విషయంలో కొడుకుల మధ్య గొడవలు తలెత్తాయి. వెంకటయ్యను ఒక్కో నెల ఒక్కో కొడుకు వద్ద వంతులవారీగా ఉండాలని తీర్మానించారు.
గ్రామంలో ఉన్న కొడుకులు సరిగ్గా తిండిపెట్టక పోవడం, ఇతర గ్రామాల్లో ఉన్న కొడుకుల వద్దకు వెళ్లలేని పరిస్థితిలో వెంకటయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన వ్యవసాయ భూమి సమీపంలో ఎల్లమ్మ గుట్ట వద్ద తాటి కమ్మలు, ఇతర కర్రలు పోగు చేసి చితిగా పేర్చుకొని నిప్పంటించి వెంకటయ్య అందులో దూకి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. కాలిపోయిన స్థితిలో శవాన్ని గుర్తించిన చుట్టుపక్కలవారు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వచ్చిన కుటుంబసభ్యులు వెంకటయ్య శవంగా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.