నిజామాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘సార్.. దేశాలా కేసీఆర్ పాహిజే’(మరాఠీ).. దీని అర్థం దేశానికి కేసీఆర్ కావాలి అని. ఈ మాటలు అన్నది మహారాష్ట్రవాసి సురేశ్. మహారాష్ట్రలోని దెగ్లూర్ తాలుకా నేరంగల్ గ్రామానికి చెందిన సురేశ్ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పోతంగల్లో బంధువుల ఇంటికి వచ్చాడు. గ్రామంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం డబుల్ బెడ్రూం గృహప్రవేశ కార్యక్రమం అనంతరం నిర్వహించిన సభకు వచ్చిన సురేశ్.. తాను మాట్లాడతానని మైకు అందుకొన్నాడు. సురేశ్ అన్న మాటలు తెలుగులో ఇలా.. ‘సార్.. కేంద్రంలో మీ(టీఆర్ఎస్) ప్రభుత్వమే రావాలి. మీ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను చూసి ఆశ్చర్యపోతున్నం. దేశమంతా తెలంగాణ పథకాలు రావాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొద్దికాలంలోనే ఊహించని మార్పు వచ్చింది. మా చుట్టాలు మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చెప్తుంటే నమ్మేవాళ్లం కాదు. కానీ, ఇప్పుడు స్వయంగా నా కండ్లతో చూస్తున్నా. మా దగ్గర రైతుబంధు లేదు. రైతుబీమా లేదు. డబుల్ బెడ్రూం లేదు. ఇంటింటికీ తాగునీరు లేదు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా అసలే లేదు. సాగు నీటి కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మీ ప్రాంతంలో ప్రభుత్వం బాగున్నది. దేశంలో కూడా కేసీఆర్ ఆధ్వర్యంలోనే పాలన రావాలి. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే మాకు కూడా ఈ పథకాలు వస్తాయి. మా తిప్పలు పోతాయి. ఇప్పుడు తెలంగాణలో అమలవుతున్న పథకాలే దేశం మొత్తం వర్తింపజేయాలి’ అంటూ ముగించాడు. సురేశ్ మాట్లాడుతున్నంత సేపు గ్రామస్థులతోపాటు సభాపతి ఆసక్తిగా విన్నారు. అనంతరం పోచారం సహా గ్రామస్థుల చప్పట్లతో సభాప్రాంగణం మారుమోగింది.