హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ): చిన్న పొలాల్లో కలుపుతీత సమస్యకు పరిష్కారం చూపే యంత్రాన్ని హైదరాబాదీ స్టార్టప్ ఎక్స్మెషిన్స్ అభివృద్ధి చేసింది. ఎక్స్-100 పేరుతో రూపొందించిన ఈ యంత్రం.. చిన్న పొలాల్లో కలుపు తీసేందుకు అనుకూలంగా ఉంటుందని స్టార్టప్ వ్యవస్థాపకుడు త్రివిక్రమ్ కుమార్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో నడిచే ఈ యంత్రానికి ఇతర పనిముట్లు కూడా జోడించి వీడ్ కంట్రోల్, స్ప్రేయింగ్, ప్లాంటర్, సీడ్ సోవర్, ఫర్టిలైజర్ డ్రాపర్ పనులు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ రోబో-రోటావేటర్ అని, ఎకరాకు రూ.20- రూ.50 విద్యుత్తు మాత్రమే ఖర్చు అవుతుందని వివరించారు. ఒక రోజులో 2.5 ఎకరాల వరకు కలుపు తీస్తుందని, రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో దీన్ని శాస్త్రీయంగా పరీక్షించామని తెలిపారు. ఈ యంత్రంలోని భాగాలన్నీ భారత్లో తయారైనవేనని, దీని ధర రూ.1.75 లక్షల నుంచి మొదలవుతుందని పేర్కొన్నారు.