వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్లో (Texas) జరిగిన కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన యువతి మృతి చెందింది. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ శివారులో ఉన్న అలెన్ మాల్లోకి (Allen mall) చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు (Gun fire) జరిపాడు. కాల్పుల్లో నిందితుడు సహా తొమ్మిది మంది మరణించారు. కాల్పుల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో హైదరాబాద్ కొత్తాపేటకు చెందిన తాటికొండ ఐశ్వర్య (Tatikonda Aishwarya) కూడా ఉన్నారు.
తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఐశ్వర్య చనిపోయారు. రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి అయిన తాటికొండ నర్సిరెడ్డి కుమార్తె అయిన ఐశ్వర్య.. ఉన్నత విద్య అభ్యసించడానికి కొన్నాళ్ల క్రితమే టెక్సాస్ వెళ్లారు. వీరి స్వస్థలం సూర్యాపేట జిల్లా నేరడుచర్ల. కాగా, ఐశ్వర్య మృతిని అమెరికాలోని తెలుగు సంఘాలు, ఆమె కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
అలెన్ మాల్లో జరిగిన కాల్పుల్లో సెక్యూరిటీ గార్డ్ కూడా మరణించారు. మాల్లోకి ప్రవేశించే ముందు ఓ పోలీసు అధికారిని కూడా దుండగుడు కాల్చి చంపాడు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అప్పటికే కాల్పులు జరుతున్న అంగతకుడిని కాల్చివేశారు. కాల్పుల ఘటన సమయంలో మాల్లో వందలాది మంది ఉన్నారని పోలీసులు తెలిపారు.