Ganja Chocolates | హైదరాబాద్ సిటీబ్యూరో/కొత్తూరు/శంషాబాద్ రూరల్ జనవరి 10 (నమస్తే తెలంగాణ): అది రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.. ఈ మధ్య ఈ పాఠశాల బాలురంతా వింతగా ప్రవర్తించటం మొదలుపెట్టారు. బెంచీలపై పడుకోవటం, క్లాస్లోనే మూత్రవిసర్జన చేయటం, బాలికల ముందు అసభ్యంగా ప్రవర్తించటం చేశారు. అలా ఒకరిద్దరు చేస్తే దండించి వదిలిపెట్టేవారే ఆ హెడ్మాస్టర్. కానీ, చాలా మంది అలాగే ప్రవర్తించటంతో హెడ్మాస్టర్ అంగూర్ నాయక్కు అనుమానం వచ్చింది. అసలు వీళ్లకేం జరుగుతున్నదో తెలుసుకోవాలని నిఘా పెట్టారు. వాళ్లతో స్నేహంగా ఉంటూనే, వాళ్లేం చేస్తున్నారో గ్రహించారు.
ఎక్కడి నుంచో చాక్లెట్లు తీసుకొచ్చి తింటూ ఇలా క్లాస్రూమ్లో పడిపోతున్నట్టు గుర్తించారు. తనకూ ఆ చాక్లెట్లు కావాలని అడిగి తిని రుచి చూశారు. అందులో గంజాయి కలిసిందని తెలుసుకొని, ఎక్కడ దొరుకుతాయో వివరాలు సేకరించారు. దీంతో అసలు విషయం బయటపడింది. కొత్తురు పోలీసు స్టేషన్కు ఆనుకుని ఉన్న ఒక కిరాణాషాపుతో పాటు స్థానికంగా ఉన్న పాన్షాప్, పాఠశాల పరిసరాల్లో ఉన్న పలు కిరాణా దుకాణాల్లో మత్తు చాక్లెట్లను విక్రయిస్తారని సదరు విద్యార్థులు చెప్పారు. ఒక్కో చాక్లెట్ రూ.25కు లభిస్తుందని, వాటిని చాలా మంది విద్యార్థులే కాకుండా ఇతరులు కూడా కొంటారని విద్యార్థులు తెలిపారు.
డీఈవో సహకారంతో పోలీసులకు ఫిర్యాదు
ఆధారాలతో వివరాలు సేకరించిన అంగూర్ నాయక్.. ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారికి తెలియజేశారు. సదరు విద్యాధికారి మాజీ జైలర్ కావటంతో ఆయన తనకున్న పోలీసు ఉన్నతాధికారుల సహకారంతో నేరుగా శంషాబాద్ జోన్ డీసీపీ నారాయణరెడ్డికి సమాచారం అందించారు. ఆయన స్థానిక ఎస్వోటీ బృందాలతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి గం జాయి చాక్లెట్ల గుట్టు రట్టుచేశారు.
ఈ వివరాలను బుధవారం పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఒడిశాకు చెందిన వీరేంద్ర బెహరా (33), సోమనాథ్ బెహరా(35), సురిజ్యామిని సాహూ(35) కొత్తూరు మున్సిపాలిటీలో వివిధ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తూ, ఒడిశాలో రూ.9కి గంజాయి చాక్లెట్లను కొని, ‘చార్మినార్ మునక్కా గోల్డ్’ పేరుతో ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.
కొత్తూరు ఠాణా పక్కనే విక్రయాలు
మత్తు చాక్లెట్లను దర్జాగా కొత్తురు పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడకు ఆనుకొని ఉన్న కిరాణాషాపులోనే విక్రయించటం గమనార్హం. ఠాణా పక్కన ‘సంతోష్ కిరాణ అండ్ జనరల్ స్టోర్’ పేరుతో ఏడాది కాలం గా మత్తు చాక్లెట్లను వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కిరాణ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టగా 8 కిలోల గంజాయి చాక్లెట్లు లభించాయి. పరిసర ప్రాంతాల్లో మరికొన్ని దుకాణాల్లో సైతం పోలీసులు తనిఖీలు నిర్వహించగా, నిందితులు పరారైనట్టు తెలిసింది. కాగా, ఒక చాక్లెట్ తీసుకుంటే సుమారు 48 గంటల వరకు మ త్తు ఉంటుందని బాధితులు చెప్తున్నారు.
విద్యార్థు లు ఒక చాక్లెట్ను నలుగురు షేర్ చేసుకుని తింటారని, దీంతో కనీసం 12 గంటలపాటు మత్తులో జోగుతున్నట్టు తేలింది. ఆ ప్రాంతంలో విద్యార్థులే కాకుండా, కార్మికులు, యువత కూడా గంజాయి చాక్లెట్లు తింటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హెడ్మాస్టర్ అంగూర్ నాయక్ గుర్తించకపోతే తమ బిడ్డల పరిస్థితి ఏమయ్యేదోనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల కిందటే ఈ పాఠశాలలో డ్యూటీలో చేరిన ఆయన.. విద్యార్థుల భవిష్యత్తు కాపాడి, శభాష్ అనిపించుకున్నారు.