హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లో మౌలిక వసతుల కల్పన అద్భుతంగా జరుగుతున్నదని ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదేండ్ల నుంచి వేల కోట్ల రూపాయలతో విస్తృత స్థాయిలో మౌలిక వసతులను కల్పిస్తుండటం ఇతర మెట్రో నగరాల వాసులనూ ఆకర్షిస్తున్నదని, అందుకే వివిధ కంపెనీలు, వ్యాపారాలకు హైదరాబాద్ దేశంలోనే ప్రధాన గమ్యస్థానంగా మారుతున్నదని ఎయిమ్స్ పూర్వ విద్యార్థి డాక్టర్ ప్రసాద్ గురు కొనియాడారు.
ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం ఓ ట్వీట్ చేశారు. భారత సిలికాన్ వ్యాలీగా పేరు పొందిన కర్ణాటక రాజధాని బెంగళూరులో మౌలిక వసతుల కల్పన హైదరాబాద్లో జరిగినంత విస్తృతంగా జరగడం లేదని ఆ ట్వీట్లో అభిప్రాయపడ్డారు. ఆ ట్వీట్కు రాజకీయాన్ని కూడా జోడించిన డాక్టర్ ప్రసాద్ గురు.. కర్ణాటకలో సీఎం బసవరాజ్ బొమ్మైతోపాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్, కుమారస్వామి లాంటి ప్రతిపక్ష నేతలంతా బెంగళూరులో మౌలిక వసతుల కల్పనను విస్మరిస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కంపెనీలకు హైదరాబాదే ప్రధాన గమ్యస్థాంగా మారుతుందని కుండ బద్ధలుకొట్టారు.
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని టీ-హబ్, కేబుల్ బ్రిడ్జి, రహేజా మైండ్ స్పేస్ తదితర ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అద్ధం పట్టే 4 ఫొటోలను జోడించడంతో ఆయన ట్వీట్ వైరల్గా మారింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహా ఎంతో మంది లైక్లు కొట్టడంతో ఆ ట్వీట్పై బెంగళూరు, హైదరాబాద్కు చెందిన వందలాది మంది నెటిజన్ల మధ్య చర్చ మొదలైంది.