హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ): గత ఎనిమిదేండ్లలో హైదరాబాద్ అభివృద్ధి రియల్ సంస్థలకు వెయ్యి ఏనుగుల బలంగా మారింది. దీంతో హైదరాబాద్ రియల్ వ్యాపార మంత్రం అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. సామాజిక మాధ్యమాల్లోనే కాదు.. వివిధ దేశాల్లో కొన్ని రియల్ సంస్థలు ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేసి ఎన్నారైలకు హైదరాబాద్ అభివృద్ధిని వివరిస్తున్నాయి. వినూత్న ప్రచారంతో హైదరాబాద్ పరిసరాల్లో తమ రియల్ ప్రాజెక్టుల వైపు ఎన్నారైలను ఆకర్షిస్తున్నాయి. నగరం విస్తరణ, భవిష్యత్ అంచనా, అంతర్జాతీయ కంపెనీలు, క్యాంపస్ల ఏర్పాటు వంటి ఆకర్షణీయ వివరాలను ఎన్నారైలకు వల్లె వేస్తున్నారు.
ఐదు దేశాల్లో గూగీ ప్రాపర్టీస్ కార్యాలయాలు
2017లో ప్రారంభమైన గూగీ ప్రాపర్టీస్ రియల్ సంస్థ అంతర్జాతీయ ప్రచారంలో ముందున్నది. దుబాయ్, సౌదీ అరేబియా, అమెరికా, ఆస్ట్రేలియాల్లో కార్యాలయాలను తెరిచింది. నగర అభివృద్ధిని కళ్లారా చూసిన సంస్థ ఎండీ షేక్ అక్బర్ అంతర్జాతీయ ప్రచారానికి చొరవ చూపారు. నాలుగేండ్ల వ్యవధిలోనే ఈ సంస్థ 12 ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఆయనకు 2019లో సిలికాన్ ఇండియాలో కంపె నీ ఆఫ్ ది ఇయర్ రియల్ ఎస్టేట్ అవార్డు, 2020 లో బిజినెస్ కనెక్ట్ ద్వారా సీఈవో ఆఫ్ ది ఇయర్, 2021లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ ఆఫ్ది ఇయర్ 2021 అవార్డులు దక్కాయి.
భరోసాతోనే పెట్టుబడులు పెడుతున్నారు..
సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణలో ఉహించని అభివృద్ధి జరుగుతున్నది. హైదరాబాద్పై భరోసాతోనే ఎన్నారైలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పుడు నాలుగు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. త్వరలో వీటి సంఖ్యను పెంచబోతున్నాం.
– షేక్ అక్బర్, ఎండీ, గూగీ ప్రాపర్టీస్