హైదరాబాద్/సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): సాహితీ ఇన్ఫ్రా కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏపీలోని సాహితీ ఇన్ఫ్రా యజమాని బుదాటి లక్ష్మీనారాయణ ఆస్తులను అటాచ్ చేశారు. ఆ ఆస్తుల వద్ద నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయించారు. రూ.1500 కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తివేసిన సాహితీ ఇన్ఫ్రా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి, ఆస్తులను అటాచ్ చేశామని సీసీఎస్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. సాహితీ ఇన్ఫ్రాపై ఇప్పటివరకు 50 కేసులు నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మంది నుంచి రూ.530 కోట్లు వసూలు చేసిందని, 38 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణం పేరుతో భారీ మోసానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. మరో ప్రాజెక్టులో రూ.900 కోట్లు సాహితీ ఇన్ఫ్రా వసూలు చేసిందని సమాచారం. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో హైదరాబాద్లోని సుమారు 3 వేల మంది వద్ద నుంచి రూ.కోట్లు వసూలు చేసినట్టు బాధితులిచ్చిన ఫిర్యాదుతో సీసీఎస్లో కేసు నమోదైంది.