హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి ప్రతిష్ఠాత్మక చరక అవార్డును అందుకున్నారు. చెన్నైకి చెందిన రోటరీ క్లబ్ ఆఫ్ గిండీ గురువారం ఈ అవార్డును ప్రదానం చేసింది. వ్యాధులపై పరిశోధనలు చేయడం, స్వచ్ఛమైన తాగునీటి వసతిని కల్పించడం వంటి అంశాల ఆధారంగా క్లబ్ ఈ అవార్డును అందజేస్తుంది.
క్లబ్ అధ్యక్షుడు రమేశ్బాబు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకొన్నారు. చరక అవార్డు అందుకోవడం సంతోషకరమని, ప్రజారోగ్య రంగంలో సేవలందించే వారికి తనవంతుగా ప్రోత్సాహం అందజేస్తానని ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వర్రెడ్డి తెలిపారు.