సంగారెడ్డి కలెక్టరేట్, మే 7: పాత భవనాలు, బ్రిడ్జిల జీవితకాలాన్ని మరో 20 ఏండ్లపాటు పెంచేందుకు దోహదపడే ఎఫ్ఆర్పీ (ఫైబర్-రీఇన్ఫోర్స్డ్ పాలిమెర్)ని ఆవిష్కరించినట్టు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ సూర్యప్రకాశ్, పీహెచ్డీ స్కాలర్ మల్లేశ్వర్రావు బృందం ఎఫ్ఆర్పీని అభివృద్ధి చేశారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలకు గురైన పాత భవనాలు, బ్రిడ్జీలను సంరక్షించేందుకు ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు. సాధారణంగా సంప్రదాయ పద్ధతుల్లో పాత భవనాల కాంక్రీట్ను మార్చడం లేదా పెంచడంతో ఆయా భవనాల పరిమాణం పెరిగే అవకాశం ఉంటుందని, ఎఫ్ఆర్పీ విధానంలో ఎలాంటి పరిమాణం పెరగకుండానే భవన సామర్థ్యాన్ని పెంచుతుందని చెప్పారు. తక్కువ ఖర్చుతో పాత భవనాలు, వంతెనల నిర్మాణాలను మరింత కాలం నాణ్యతతో కాపాడుకోవచ్చని వివరించారు. ఇప్పటికే 25కు పైగా అంతర్జాతీయ జర్నల్స్లో ఎఫ్ఆర్పీ గురించి ప్రచురితమైందని బీఎస్మూర్తి వెల్లడించారు.