హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ గడ్డ మీద సెప్టెంబర్ 17 ముసుగులో బీజేపీ చీకటి రాజకీయం చేస్తుండటంపై తెలంగాణ సమాజం మండిపడుతున్నది. స్టేట్ రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు హైదరాబాద్ అడుగేసిన రోజును బీజేపీ తన రాజకీయ పబ్బం కోసం వాడుకుంటున్నదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. స్వాతంత్య్రానంతరం హైదరాబాద్ స్టేట్ కన్నా ముందే గుజరాత్లోని జునాగఢ్ సంస్థానం ఇండియన్ యూనియన్లో చేరింది. అక్కడ ఎలాంటి ఉత్సవాలనూ నిర్వహించకుండా తెలంగాణపై మాత్రమే బీజేపీ ఎందుకు సంబురాల పేరుతో హంగామా చేస్తున్నదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ సెప్టెంబర్ 17 ముసుగేసుకొని ఇక్కడ హంగామా చేసేందుకు ప్రయత్నిస్తున్నదని తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. రాష్ట్రంలో ప్రశాంత జీవనాన్ని అశాంతి పాల్జేయడమే లక్ష్యంగా సెప్టెంబర్ 17ను బీజేపీ పావుగా వాడుకుంటుందే తప్ప.. ఈ ప్రాంతంపై ఆ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధిలేదని మేధావులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో మతపరమైన చీలికలను ప్రేరేపించే ప్రయత్నంగా సెప్టెంబర్ 17ను బీజేపీ వాడుకుంటున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే బీజేపీ ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం బలంగా తిప్పికొడుతున్నది. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటించాలని భారీ కార్యాచరణను ఇప్పటికే ప్రకటించింది.
సెప్టెంబర్ 17 నేపథ్యంగా బీజేపీ రాష్ట్రంలో ఎంపిక చేసుకున్న కార్యాచరణే ఆ పార్టీ ద్వంద్వవైఖరికి నిదర్శనమని తెలంగాణ సమాజం నిప్పులు చెరుగుతున్నది. హైదరాబాద్ స్టేట్ కన్నా ముందే భారతదేశంలో కలిసిన జునాగఢ్ సంస్థాన ప్రాంతంలో ఆ పార్టీ ఎన్నడూ ఎటువంటి కార్యక్రమాలనూ చేపట్టలేదు.
జునాగఢ్పై మౌనంగా ఉన్న బీజేపీ తెలంగాణనే ఎందుకు లక్ష్యంగా చేసుకుని హంగామా చేస్తున్నదని బుద్ధిజీవులు ప్రశ్నిస్తున్నారు. మోదీ సొంతరాష్ట్రమైన గుజరాత్లో ఉన్న జునాగఢ్ను విస్మరించి తెలంగాణలోనే విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నించడం వెనుక బీజేపీ చీకటి రాజకీయమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జునాగఢ్పై మోసపూరిత మౌనాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీ.. తెలంగాణపై మాత్రం మొసలికన్నీరు కారుస్తున్నది. హైదరాబాద్లో మాత్రమే బీజేపీ హంగామా చేయటంలోని ఆంతర్యం రాజకీయ, విద్వేష పూరిత వాతావరణాన్ని సృష్టించటమేనని పలువురు మేధావులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని బీజేపీ మునుపెన్నడూ లేనివిధంగా రచ్చచేసేందుకు ప్రయత్నించడం వెనుక రాజకీయ ప్రయోజనాలే తప్ప, ఈ ప్రాంత ప్రజలపై ప్రేమ ఏమాత్రం లేదని వారు చెప్తున్నారు.
గంగా జమునా తెహజీబ్గా సాగుతున్న హైదరాబాద్ సహజ జీవన సంస్కృతిని మలినం చేసేందుకే బీజేపీ సెప్టెంబర్ 17న ఎంచుకున్నదని తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. ప్రజల మధ్య చీలికలు సృష్టించి తద్వారా పబ్బం గడుపుకోవాలని.. ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ హైదరాబాద్పై తన చీకటి ఎజెండాను అమలు చేస్తున్నదనే విమర్శలూ వినిపిస్తున్నాయి.
జునాగఢ్ సంస్థానాన్ని పాలిస్తున్న మూడో నవాబు ముహమ్మద్ మొహబ్బత్ఖాన్-III తన సంస్థానాన్ని పాకిస్థాన్లో కలపాలని చివరి నిమిషం వరకు భావించారు. ఇదే అభిప్రాయాన్ని ఆయన బహిరంగంగానూ ప్రకటించారు. ప్రజలు మాత్రం తాము భారత్లోనే కలుస్తామని తేల్చిచెప్పారు. అప్పుడు దేశంలో స్వతంత్ర సంస్థానాలుగా ఉన్న అన్ని ప్రాంతాల కన్నా జునాఘడ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దీన్ని గమనించిన భారత తొలి ప్రభుత్వం ప్లెబిసైట్ నిర్వహించింది. ఇందులో 99 శాతం మంది ప్రజలు జునాగఢ్ స్టేట్ను భారత్లో కలుపాలనే తేల్చిచెప్పారు. 1947 నవంబరు 1న రాచరిక రాష్ర్టాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆనాటి హోంమంత్రి పటేల్ భారత సైన్యాన్ని జునాగఢ్కు పంపారు.
నవంబర్ 7న జునాగఢ్ భారత్లో కలిసింది. ఈ చారిత్రక నేపథ్యాన్ని బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ ఇప్పటి వరకు మాట్లాడలేదు సరికదా.. కనీసం అక్కడ ఏ అధికారిక కార్యక్రమాన్నీ నిర్వహించలేదు. అలాంటి డిమాండ్ కూడా చేయలేదు. ‘ది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో పటేల్ విగ్రహాన్ని ప్రారంభించే సమయంలోనూ గుజరాత్ గడ్డపై ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రసంగంలోనూ జునాగఢ్ ప్రస్తావనే తీయకపోవడం గమనార్హం.