హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా శనివారం మద్యం ఏరులై పారుతుంది. పార్టీలో ఫుల్లుగా తాగేసి తమ గమ్యస్థానాలకు చేరేందుకు అనేక మంది తంటాలు పడుతుంటారు. అలాంటి వారి కోసం తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్స్ అసోసియేషన్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఐదేండ్లుగా ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మద్యం సేవించి ఇంటికి వెళ్లలేని స్థితిలో ఉన్న వారిని గుర్తించి, సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చుతున్నారు. ఈ ఏడాది కూడా హైదరాబాద్ వ్యాప్తంగా 300 వాహనాలను ఈ సేవలకు వినియోగిస్తున్నామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. ఫోన్, లొకేషన్ ఆధారంగా ఇంట్లో దిగబెడతారు. ఇతర వివరాలకు 91776 24678కు ఫోన్ చేయాలని సలావుద్దీన్ పేర్కొన్నారు.