ధర్మసాగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల విఫల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ధర్మసాగర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. పీఏసీఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో వేలేరు, ధర్మసాగర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హామీల అమలులో చేతులెత్తేసిన కాంగ్రెస్, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
రైతులకు పెట్టుబడి భరోసా, రుణమాఫీ, మహిళలకు ఆర్థిక సహాయం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, యువతకు భరోసా వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రజలను నిరాశకు గురిచేస్తోందని విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం, సాగునీటి సమస్యలపై పట్టించుకోకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి మందగించడం, సంక్షేమ పథకాల అమలులో జాప్యం వంటి అంశాలపై నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. “1000 రోజుల పాలనలో ప్రజలకు ఏం ఒరిగింది?” అంటూ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పోలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇబ్బందులు పెరిగాయని నాయకులు పేర్కొన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం రాజకీయ విమర్శలకే పరిమితమవుతోందని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడి, ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంతో ధర్మసాగర్ మండల కేంద్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లాల్ మహ్మద్, మెరుగు రాజిరెడ్డి, కాయిత మాధవరెడ్డి, శాతబోయిన రమేష్, రాజు, సురేష్, కమలేష్, బెల్లం ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.