చౌటుప్పల్/నాంపల్లి/మునుగోడు, అక్టోబర్ 27: టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో గులాబీ పార్టీకి అపూర్వ మద్దతు లభించింది. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగోజిగూడెం ఎస్సీ కాలనీలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన 50 మంది కార్యకర్తలు మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. నాంపల్లి మండలం లక్ష్మణాపురంలో 300 మంది ప్రాజెక్టు భూ నిర్వాసితులు మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. నాంపల్లి మండలం పసునూరులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో వివిధ పార్టీల వారు టీఆర్ఎస్లోకి చేరారు.
నాంపల్లి మండ లం రాజ్యతండాలో 20 మంది బీజేపీ కార్యకర్తలు ఎంపీ మాలోతు కవిత ఆధ్వర్యంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. నాంపల్లి మండలం సుంకిశాలలో 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో గులాబీ గూటికి చేరారు. నాంపల్లి మండలం రెవెల్లిలో పలువురు బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లోకి చేరారు. చౌటుప్ప ల్ పట్టణం పదో వార్డుకు చెందిన వివిధ పార్టీలకు చెందిన 20 మంది యువకులు జగిత్యా ల ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నాంపల్లి మండలం నేరెళ్లపల్లిలో కాంగ్రెస్ 10 వ వార్డు సభ్యుడితోపాటు 10 మంది బీఎస్పీ కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మునుగోడు మండం పలివెల కు చెందిన సింగిల్ విండో మాజీ డైరెక్టర్ మొక్క యాదయ్యతోపాటు పలువురు గురువారం పల్లా సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ బాలరాజు ఎంపీటీసీ కృష్ణయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు వెంకటేశం పాల్గొన్నారు.