హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ( Revanth Reddy ) బహిరంగ లేఖ రాశారు. సూర్యాపేట జిల్లాలో మైనింగ్ ( Mining ) ఈ-వేలంలో భారీ అక్రమాలు ( Irregularities ) చోటు చేసుకున్నాయని , స్వతంత్ర విచారణ చేసి టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 1,100 ఎకరాల రిజర్వ్డ్ ఫారెస్ట్పై స్పష్టత లేకుండానే వేలం నిర్వహించారని ఆరోపించారు.
కీలక సాంకేతిక వివరాల్లో లోపం , లాటిట్యూడ్, లాంగిట్యూడ్, డీజీపీఎస్ సర్వే వివరాలు వెల్లడించలేదని విమర్శించారు.జియోలాజికల్ నివేదికలు సైతం లేవని ఆరోపించారు. మినరల్ ఆక్షన్ రూల్స్-2015 ఉల్లంఘన జరిగిందని హైకోర్టు సూచనలు పట్టించుకోలేదన్నారు. పర్యావరణ అనుమతులు పూర్తికాకముందే ప్రిఫర్డ్ బిడ్డర్ల ప్రకటన,కంపెనీల ఎంపికపై అనుమానాలున్నాయని పేర్కొన్నారు.
మైనింగ్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కేసులు ఎదుర్కొంటున్న డెక్కన్ సిమెంట్స్, ఎన్సీఎల్ ( NCL ) ఇండస్ట్రీస్కు బ్లాక్ల కేటాయింపుపై సందేహాలున్నాయని తెలిపారు.టెండర్ రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అన్ని అనుమతుల తర్వాతే పారదర్శకంగా కొత్త వేలం నిర్వహించాలని సూచించారు. గనుల శాఖ చేపట్టిన ఈ వేలం ప్రక్రియ పారదర్శకతకు విరుద్ధంగా సాగిందని ఆయన విమర్శించారు.
టెండర్ నోటీసు జారీకి ముందే మినరల్ బ్లాక్లను ఖచ్చితంగా గుర్తించి పూర్తి వివరాలు వెల్లడించడం తప్పనిసరి అయినప్పటికీ, ఈ నిబంధనలు పాటించలేదని విమర్శించారు. ఈ అక్రమ టెండర్లపై మరింత ఆందోళన కలిగించే అంశాలను కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. న్యాయపరమైన విచారణలు పెండింగ్లో ఉన్నప్పటికీ వేలాన్ని ముందుకు తీసుకెళ్లడం, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సూచనలను పట్టించుకోకపోవడం, చట్టపరమైన , పర్యావరణ అనుమతులు పూర్తికాకముందే ప్రిఫర్డ్ బిడ్డర్లను ప్రకటించడం వంటి అంశాలు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు.
మైన్స్ అండ్ జియోలజీ శాఖ లీగల్ ఆఫీసర్ ఈ బ్లాక్ల సమాచారాన్ని గోప్యంగా పేర్కొంటూ ఫిర్యాదుదారునికి ఇవ్వడానికి నిరాకరించడం పారదర్శకతపై అనుమానాలు పెంచుతోందని అన్నారు.ప్రస్తుత వేలం ప్రక్రియకు సంబంధించిన అన్ని చర్యలను తక్షణమే నిలిపివేయాలని, నోటిఫికేషన్ నెం. 2263906/DM&G MI/Lst/2023 కింద చేపట్టిన టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
స్వతంత్ర , పారదర్శక విచారణను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని, అవసరమైన శాస్త్రీయ సర్వేలు, జియోలాజికల్ డేటా వెల్లడి, అటవీ అనుమతులు పొందిన తర్వాత మాత్రమే చట్టబద్ధంగా కొత్త టెండర్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకోవాలని కేటీఆర్ కోరారు. ఈ లేఖ ప్రతులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా పంపారు.