Jurala Dam | జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రియదర్శిని డ్యామ్కు భారీగా వరద వస్తున్నది. ఎగువ నుంచి 66వేల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. దాంతో అధికారులు జూరాల డ్యామ్ పదిగేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అలాగే, పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉప నదులకు వరద ఉధృతి పెరిగింది. ఫలితంగా వరద నీరంతా వచ్చి కృష్ణా నదిలో కలుస్తున్నది. ప్రస్తుతం 66వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. రేపటి వరకు వరద లక్ష క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ముందస్తుగా జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు.