ఆలేరు టౌన్, జూలై 4: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆసు యంత్రం సృష్టికర్త చింతకింది మల్లేశంకు అనురాగ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. హైదరాబాద్లోని అనురాగ్ యూనివర్సిటీ మూడో కాన్వొకేషన్లో భాగంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో వర్సిటీ చైర్మన్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి చేతుల మీదుగా మల్లేశం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చేనేత రంగంలో తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి చలించిన మల్లేశం.. చేనేత కళాకారుల మహిళల కష్టాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఏడేండ్లు కష్టపడి ఆసు యంత్రాన్ని తయారు చేశారు. వేలాది మంది చేనేత మహిళల జీవితాల్లో వెలుగులు నింపి విప్లవాత్మక మార్పును తీసుకువచ్చారు. వారి శ్రమను గణనీయంగా తగ్గించడంతోపాటు చేనేత రంగానికి చీరల ఉత్పత్తి పెంచి, విశేష సేవలు అందించినందుకు గుర్తింపుగా అనురాగ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా చింతకింది మల్లేశం మాట్లాడుతూ.. 2019లో గీతం యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందినట్టు తెలిపారు. ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ నుంచి పొందడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.