వ్యవసాయ యూనివర్సిటీ, మే 20 : తేనెటీగలను పెంపకం లాభాలను అందించడంతోపాటు ప్రకృతి మనుగడకూ ఎంతో దోహద పడుతుందని ఎపికల్చర్ టెక్నాలజీ సెంటర్ డైరెక్టర్ పీ రవికుమార్ చెప్పారు. శుక్రవారం ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో నీటివనరుల వృద్ధి, పంటల సాగు విస్తీర్ణం, హరితహారంతో తేనెటీగల పెంపకానికి వనరులు పెరిగాయని చెప్పారు. ఎప్పిస్, మెలిపెర వంటి తేనెటీగల రకాలు తెలంగాణ వాతావరణానికి అనుకూలమని అన్నారు. తేనెటీగల పెంపకంపై నూతన టెక్నాలజీ ఆధారంగా కేవలం 5 రోజుల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. జూన్ మొదటివారంలో నుంచి ప్రారంభమయ్యే బ్యాచ్ కోసం.. ఈ నెల చివరివరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీ మెంబర్ సితారత్నం, పలువురు రైతులు పాల్గొన్నారు.