హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ వల్లే పదిహేనేండ్లుగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య పరిషారమైందని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ కొనియాడారు. అందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేయడంతోపాటు ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ సందర్భంగా క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. జర్నలిస్ట్లపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం ఉన్నదని వివరించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్లే దశాబ్దాలుగా కోర్టులో పెండింగ్లో ఉన్న కేసు త్వరితగతిన పరిషారమైందని కొనియాడారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనా తాను ఎప్పుడూ జర్నలిస్ట్ల వైపే ఉంటానని, జర్నలిస్ట్లు అందరికీ ఇండ్లస్థలాలు వస్తాయని హామీ ఇచ్చారు. జేఎన్జేకు కేటాయించిన స్థలంగా పూర్తిగా సొసైటీకే చెందుతుందని, సభ్యులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని చెప్పారు.
అనంతరం సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవి మాట్లాడుతూ.. జర్నలిస్ట్లకు ఇండ్ల స్థలాలను ఇచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతున్నదని తెలిపారు. సొసైటీలో సభ్యులందరికీ స్థలాలు వస్తాయని, అందులో ఎలాంటి సందేహాలకు తావు లేదని అన్నారు. సీఈవో వంశీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జేఎన్జే సొసైటీ ఇండ్ల స్థలాల తీర్పు దేశవ్యాప్త జర్నలిస్ట్ల జీవితాలకు ప్రయోజనకారిగా మారిందని వివరించారు.
జర్నలిస్ట్ల జీవన స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని పేర్కొన్నారు. జస్టిస్ రమణకు, సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఈ మేరకు సర్వసభ్య సమావేశం ప్రత్యేక తీర్మానం చేసింది. సొసైటీకి అన్నివిధాలుగా అండగా నిలుస్తున్న మంత్రి కేటీఆర్కు సర్వసభ్య సమావేశం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. సమావేశంలో నేమాని భాసర్, రవికాంత్రెడ్డి, జ్యోతిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
హౌసింగ్ సొసైటీ డైరెక్టర్గా వంశీ శ్రీనివాస్
అనంతరం సొసైటీలో ఖాళీ అయిన డైరెక్టర్ పదవికి ఎన్నికలను నిర్వహించగా నిమ్మకాయల వంశీ శ్రీనివాస్ 351 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సొసైటీ డైరెక్టర్ పదవి కోసం ఉదయ్, రమేశ్బాబు, వంశీ మొత్తంగా ముగ్గురు పోటీపడ్డారు. మొత్తం 859 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనగా రెండు ఓట్లు చెల్లలేదు. మిగిలిన 857 ఓట్లను లెక్కించారు. అందులో వంశీ 596 ఓట్లు, ఉదయ్ 255, రమేశ్బాబు ఆరు ఓట్లు పొందారు.