హైదరాబాద్ : రాష్ర్టంలో శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేస్తున్నామని, హీనమైన నేరాలు చేసేవారిపై, కరడుగట్టిన నేరస్తులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నామని హోంమంత్రి మహముద్ అలీ తెలిపారు. కొండాపూర్లోని ఎనిమిదో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన 466 మంది SCTPCs ల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి హోంమంత్రి మహముద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహముద్ అలీ మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందని కొందరు మాట్లాడారు. కానీ నక్సలిజాన్ని అరికట్టామని తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలు సమర్థవంతంగా అమలైనప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ర్టం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పోలీసు శాఖను ఆధునీకరించారు. పోలీసు శాఖకు నూతన వాహనాలను సమకూర్చామన్నారు. దీంతో నేరం జరిగిన ప్రదేశానికి సిటీలో అయితే 5 నిమిషాల్లో, జిల్లాల్లో అయితే 8 నిమిషాల్లో పోలీసులు చేరుకుంటున్నారు. రాష్ర్ట రాజధాని హైదరాబాద్ను, తెలంగాణను సురక్షితంగా ఉంచేందుకు అనేక చర్యలు తీసుకున్నామని తెలిపారు.
మహిళల రక్షణకు 331 షీ టీమ్స్ను ఏర్పాటు చేశామన్నారు. దీని వల్ల మహిళలకు వేధింపులు తగ్గాయి. మహిళల భద్రతకు ప్రత్యేకంగా వుమెన్ సెఫ్టీ వింగ్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నేరాల అదుపునకు రాష్ర్ట వ్యాప్తంగా 7 లక్షలకు పైగా సీసీటీవీ కెమెరాలు అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ 16వ స్థానంలో ఉందన్నారు. దేశంలోని మొత్తం సీసీటీవీ కెమెరాల్లో, మన రాష్ర్టంలోనే 64 శాతానికి పైగా ఉన్నాయని హోంమంత్రి మహముద్ అలీ పేర్కొన్నారు.