బోధన్, మార్చి 20: ఏది వద్దనుకున్నామో అదే జరుగుతున్నది. ఏది జరుగకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే హెచ్చరిస్తున్నారో అదే జరుగుతున్నది. ప్రశాంతంగా పచ్చబడుతున్న తెలంగాణలో మత విద్వేషపు చిచ్చు రగిల్చే కుట్రలు జరుగుతున్నాయన్న హెచ్చరికలే నిజమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో రాత్రికి రాత్రే ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అధికారుల అనుమతి లేకుండా ఓ వర్గం వారు ఆదివారం తెల్లవారకముందే శివాజీ విగ్రహం ఏర్పాటుచేశారు. దానిని తొలగించాలని డిమాండ్ చేస్తూ మరో వర్గం వారు ఆందోళనకు దిగారు. దీంతో అంబేద్కర్ చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వివాదం సాయంత్రం వరకూ కొనసాగింది. బోధన్ పోలీసులు, ఆర్డీవో రాజేశ్వర్ ఇరువర్గాల ప్రజలను సముదాయించారు. అధికారిక అనుమతి వచ్చిన తర్వాత విగ్రహం పెట్టుకోవాలని నచ్చజెప్పేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకొన్నారు.
నిజామాబాద్ సీపీ నాగరాజు, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాల ప్రతినిధులను చర్చల కోసం పోలీస్స్టేషన్ రావాలని కోరారు. ఒక వర్గం వారు వెళ్లగా, విగ్రహ ఏర్పాటుకు మద్దతుగా ఉన్నవారు అక్కడి నుంచి కదలలేదు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. కొందరు పోలీసులపై రాళ్లు రువ్వడంతో బాష్పవాయువును ప్రయోగించారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం సీపీ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఉద్రిక్తతలకు కారణమైన ఇరువర్గాల్లోని వ్యక్తులను గుర్తించి కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అడిషనల్ డీజీపీ (నార్త్జోన్ ఐజీ) నాగిరెడ్డి, ఐజీ కమల్హాసన్రెడ్డి ఆదివారం రాత్రి బోధన్కు చేరుకొని పరిస్థితులను సమీక్షించారు. బోధన్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆదివారం నుంచి 114 సెక్షన్ విధించారు.
గొడవలు సృష్టించమే లక్ష్యం?
విగ్రహాలు పెట్టడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. నియమ నిబంధనలు పాటించడం, సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలి. గొడవలు లేకుండా రాష్ట్రంలో కొన్నివేల విగ్రహాలు వెలిశాయి. కానీ, కొన్నిచోట్ల మాత్రమే విగ్రహాల ఏర్పాటు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నది. వారి లక్ష్యం విగ్రహం పెట్టడం కాదు, గొడవలు సృష్టించమేనన్నది స్పష్టమవుతున్నది.
బోధన్ ఘటనపై హోంమంత్రి ఆరా
బోధన్ ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ ఆరా తీశారు. డీజీపీ మహేందర్రెడ్డి, నిజామాబాద్ కమిషనర్ నాగరాజుతో మాట్లాడి వివరాలు తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని మతాలకు, కులాలకు సమ ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలో శాంతివాతావరణం నెలకొల్పారని చెప్పారు.