Home Minister Mahmood Ali | మహిళలను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నానని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న పలువురు మహిళలను సన్మానించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి కార్యాలయంతో పాటు మొగల్పూర్లో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సినీ నటుడు సుమన్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. సినీ హీరోయిన్ నాగదుర్గ నాయుడు, ఆంధ్రజ్యోతి చీఫ్ సబ్ ఎడిటర్ డీపీ అనురాధ, డిజైనర్ గొడి వందన, ఉప్పల్ ఫౌండేషన్ కో-చైర్మన్ స్వప్న, డాక్టర్ నాగనందిని, డిజైనర్ లతారెడ్డి తదితరులను హోం మంత్రి అవార్డులను అందజేసి సత్కరించారు.
మహిళా దినోత్సవ సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి మహిళలు సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నానని హోం మంత్రి అన్నారు. ప్రజా డైరీ మాసపత్రిక ఎడిటర్ వీ సురేష్, డాక్టర్ విజయ భాస్కర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మొగల్పురలోని ఉర్దూ ఘర్లో జరిగిన వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం భద్రత విషయంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు.
దాంతో అనేక మంది పోలీసుశాఖలో సేవలందిస్తున్నారని చెప్పారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, అల్లర్లు, నక్సలిజం లేవన్నారు. 100కు డయల్ చేసిన ఐదు నిమిషాల్లోనే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని హోంమంత్రి తెలిపారు. గత ఎనిమిదిన్నరేళ్లలో మహిళల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నామన్నారు. మహిళలు తమ పిల్లలకు విద్య అందించాలని, వారికి ఉన్నత విద్యను అందించాలని, దుర్వినియోగాన్ని అరికట్టాలని సూచించారు.