వైరా, ఆగస్టు 22: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ ప్రధానోపాధ్యాయుడిని గ్రామస్థులు చితకబాదారు. అనంతరం సర్పంచ్ ఇంట్లో నిర్బంధించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురంలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామం లోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాలాది రామారావు కొన్నిరోజులుగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తరగతి గదిలో పాఠాలు బోధించే సమయంలో చేతులు పట్టుకోవడం, బాలికల శరీరభాగాలను తాకడం చేస్తున్నాడు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గాంధీజీ సినిమా ప్రదర్శన సమయంలో ఇద్దరు పదో తరగతి విద్యార్థినుల మధ్యలో కూర్చొని భుజాలపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. గతంలో విద్యార్థుల చేత కాళ్లు కూడా పట్టించుకున్నాడు.
హెచ్ఎం వ్యవహారంతో విసిగిపోయిన విద్యార్థినులు విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. ఎంఈవో కొత్తపల్లి వెంకటేశ్వర్లుకు ఆదివారమే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సోమవారం పాఠశాలకు వస్తున్న హెచ్ఎంను అడ్డగించి దేహశుద్ధి చేశారు. అనంతరం సర్పంచ్ ఇంట్లో అతడిని నిర్బంధించారు. విషయం తెలుసుకొన్న వైరా, తల్లాడ ఎస్సైలు శాఖమూరి వీరప్రసాద్, సురేశ్ గ్రామానికి చేరుకున్నారు. రామారావును వైరా పోలీస్స్టేషన్కు తరలిస్తుండగా.. గ్రామస్థులు పోలీస్ వాహనాన్ని అడ్డుకొని రామారావును మరోసారి చితకబాదారు. హెచ్ఎంను తమకు అప్పగించాలని గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి నిందితుడిని పోలీస్స్టేషన్కు తరలించారు.