మంత్రికి తెలంగాణ అర్చక సమాఖ్య వినతి
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 6 ఏ, 6 బీ, 6 సీ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులందరికీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలివ్వాలని తెలంగాణ అర్చక సమాఖ్య ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. దేవాదాయ అధికారులు 2014 జూన్ రెండు వరకు ఉన్న అర్చకులకు మాత్రమే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అమలుచేస్తున్నారని, దీనివల్ల అనేకమంది అర్హులైన అర్చకులకు అన్యాయం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ నేతృత్వంలో సభ్యులు మంగళవారం అరణ్యభవన్లో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వెంటనే అర్చక ట్రస్టును ఏర్పాటుచేసి అందులో అర్చక సమాఖ్యకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. గ్రేటర్ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్ తదితర కార్పొరేషన్ల పరిధిలోని అర్చకులకు కూడా ధూప, దీప నైవేద్య పథకాన్ని విస్తరించాలని విజ్ఞప్తిచేశారు. తమ విజ్ఞప్తిపై మంత్రి అల్లోల సానుకూలంగా స్పందించి అధికారులు ఆదేశాలిచ్చినట్టు ఉపేంద్రశర్మ తెలిపారు. మంత్రిని కలిసినవారిలో అర్చక, ఉద్యోగ జేఏసీ ఉపాధ్యక్షుడు టీ రాజేశ్వరశర్మ, గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు రఘు కిరణాచార్యులు తదితరులు ఉన్నారు.