Namaste Effect | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ‘విక్టోరియా మెమోరియల్ హోం’ లోని నిజాం సంపద విషయంలో ‘నాకు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదు’ అని అధికారులు కీచులాడుకుంటున్నారు. ఎవరికివారే పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. హోంలోని విలువైన నిజాం సంపద పక్కదారి పడుతున్నదని పలువురు పూర్వ విద్యార్థులు ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ‘విక్టోరియా హోంలో నయా రూల్’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ఆదివారం ప్రత్యేక కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ కథనంతో హోం అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ‘దొంగెవరంటే భుజం తడుముకున్నట్టు’గా నాకేం సంబంధం లేదంటూనే ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నట్టు తెలిసింది.
ఆగమేఘాలపై హోంకు..
విక్టోరియా మెమోరియల్ హోం గ్రేడ్ 2-బీ వారసత్వ హోదా కింద ఉన్నది. హోమ్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, పింగాణి, తదితర విలువైన వస్తువులు లాకర్స్లో ఉన్నాయి. ఆ వివరాలను గత సూపరింటెండెంట్ రిజిస్టర్లో నమోదు చేశారు. ఉద్యోగ విరమణ సందర్భంగా రిజిస్టర్ను ప్రస్తుత సూపరింటెండెంట్కు అప్పగించారు. లాకర్స్లోని సంపదను చాలామటుకు బయటకు తరలించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయంపై ‘నమస్తే’లో కథనం ప్రచురితమైన వెంటనే సదరు పూర్వ సూపరింటెండెంట్ హుటాహుటిన హోమ్కు చేరుకున్నారని తెలిసింది. ప్రస్తుత సూపరింటెండెంట్ సెలవులో ఉండడంతో ఇతర సిబ్బందితో ఇదే విషయమై ఆరా తీసినట్టు సమాచారం. తాను ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా రిజిస్టర్ను ప్రస్తుత సూపరింటెండెంట్కు అప్పగించినట్టు పూర్వ సూపరింటెండెంట్ చెబుతుండగా, తనకు అప్పగించలేదని, హోంలో ఉన్న వొకేషనల్ కోర్సు ఇన్స్ట్రక్టర్కు ఆ రిజిస్టర్ అప్పగించారని ప్రస్తుత సూపరింటెండెంట్ చెప్పినట్టు సమాచారం. వొకేషనల్ కోర్సు ఇన్స్ట్రక్టర్ కూడా రిజిస్టర్తో తనకేం సంబంధం లేదని, తనకు అప్పగించలేదని చేతులెత్తేసినట్టు తెలిసింది. ఈ విషయంపై పూర్వ, ప్రస్తుత సూపరింటెండెంట్లు, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ మధ్య ఫోన్లోనే వాదోపవాదాలు జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. హోం సంపదను కాపాడాల్సింది పోయి ఎవరికి వారు తమకేం సంబంధం లేదని తప్పించుకుంటుండడంతో పూర్వ విద్యార్థుల ఆరోపణలకు బలం చేకూరుతున్నది. లాకర్స్లో అసలు నిజాం సంపద ఉన్నదా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లాకర్ను తెరిచేందుకు నిర్ణయం..!
‘నమస్తే’ కథనాన్ని సీరియస్గా తీసుకున్న హోమ్ ఉన్నతాధికారులు, కమిషనర్ ఆదేశాలతో పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు సిద్ధమమైనట్టు సమాచారం. లాకర్ను తెరిచి స్టాక్ రిజిస్టర్లో ఉన్న వస్తువులు ఉన్నాయో? లేవో? తనిఖీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. నిజాం సంపదను వెలికి తీసి భద్రపరచాలని యోచిస్తున్నట్లు హోం వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కబ్జాలకు అడ్డుగా ఉన్నామనే..
విక్టోరియా హోమ్ ఆస్తులను కాపాడుతూ కబ్జాలకు అడ్డుగా ఉండడం గిట్టని కొందరు పూర్వ విద్యార్థులు పనిగట్టుకుని ఫిర్యాదులు చేస్తున్నారని హోమ్కు చెందిన అలినేని నర్సింహరాములు, రాము, మహేశ్, నగేశ్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. 35ఏండ్లుగా హోం ఆస్తులను తాము, ప్రస్తుత సూపరింటెండెంట్ లక్ష్మీపార్వతి సహకారంతో సంరక్షిస్తున్నామని వివరించారు. ఇది గిట్టని వారే సూపరింటెండెంట్పై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. సంస్థ ఆస్తులను కబ్జా చేయాలనే కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. హోమ్కు నిజమైన పూర్వ విద్యార్థులం తామేనని, ఇక్కడ జరుగుతున్న అన్ని కార్యకలాపాలపై తమకు అవగాహన ఉన్నదని, ఇకనైనా ఆరోపణలు మానుకోవాలని ప్రకటనలో వెల్లడించారు.