హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): భాషాపండితుల 30 ఏండ్ల ఎదురుచూపులకు తెరదించుతూ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. గ్రేడ్ -1 భాషాపండితుల పదోన్నతులను గ్రేడ్ -2 భాషాపండితులకే కేటాయించాలని తీర్పును వెలువరించింది. దీంతో గ్రేడ్ -1 పోస్టులు ఇక నుంచి భాషాశిక్షణ పూర్తిచేసిన గ్రేడ్ -2 భాషాపండితులకే దక్కుతాయి. ఈ తీర్పును అమలుచేస్తే రాష్ట్రంలోని 10,454 భాషాపండితులకు గ్రేడ్ -1 పదోన్నతులు దక్కుతాయి. ఈ తీర్పుపట్ల ఉపాధ్యాయ పండిత పరిషత్తు సహా పలు సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ప్రభుత్వం, విద్యాశాఖ చొరవ తీసుకొని తక్షణమే గ్రేడ్ -1 పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశాయి. వివరాల్లోకెళ్తే.. ప్రభుత్వ పాఠశాలలతోపాటు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు పాఠశాల్లో గ్రేడ్ -2 భాషాపండితులు పనిచేస్తున్నారు. వీరంతా తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో విద్వాన్, విశారద, భూషణ్, ప్రవీణ, బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ తెలుగు వంటి కోర్సులు, హెచ్పీటీ, టీపీటీ కోర్సులు పూర్తిచేసి గ్రేడ్ -2 భాషాపండితులుగా నియమితులయ్యారు. వీరు స్కూల్ అసిస్టెంట్ హోదా లేకుండానే ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. కానీ గ్రేడ్ -1 భాషాపండితులుగా పదోన్నతి పొందే క్రమంలో వీరికి సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) పోటీగా వస్తున్నారు. బీఈడీలో తెలుగును ఒక మెథడ్గా చదివి, ఎంఏ తెలుగు పూర్తిచేసిన ఎస్జీటీలు గ్రేడ్ – 1పదోన్నతులు పొందుతున్నారు. దీంతో తమకు పదోన్నతులు లభించడం లేదని, 90శాతం పదోన్నతులను ఎస్టీజీలే దక్కించుకొంటున్నారని భాషాపండితులు పేర్కొంటున్నారు. గ్రేడ్ -1 పదోన్నతులు తమకే కల్పించాలని కోరుతున్నారు.
న్యాయం చేసిన కేసీఆర్
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భాషాపండితులను ఆప్గ్రేడ్చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, 2017, 2019 రెండు విడతల్లో మొత్తం 8,630 మంది పండిట్లను అప్గ్రేడ్ చేసి స్కూల్ అసిస్టెంట్ హోదా కల్పించారు. 2017లో జీవో -17, 18ల ద్వారా 2,487 మంది గ్రేడ్ -2 భాషాపండితులను అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వం, తర్వాత, 2019లో జీవో -15 ద్వారా 6,143 మంది పండిట్లను అప్గ్రేడ్ చేసింది. పండిట్లను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని అభ్యంతరం వ్యక్తంచేస్తూ సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) కోర్టునాశ్రయించారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పాత జీవోలను సవరించి, ప్రత్యేకంగా జీవోలు జారీ చేసింది. ఈ జీవోలను వ్యతిరేకిస్తూ మళ్లీ ఎస్జీటీలు కోర్టును ఆశ్రయించడంతో భాషాపండితులతో పాటు, ఎస్టీజీలకు పదోన్నతులు కల్పించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ భాషాపండితులు హైకోర్టు డివిజన్ బెంచ్కెళ్లగా, సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేస్తూ భాషాపండితులకే పదోన్నతులు కల్పించాలని డివిజన్ బెంచ్ శుక్రవారం కీలక తీర్పునిచ్చింది.
భాషాపండితులకు న్యాయం జరిగింది
అన్ని రకాల అర్హతలున్నా మేం ఎన్నో ఏండ్లుగా పదోన్నతులకు నోచుకోలేకపోయాం. మా కండ్ల ముందే ఇతరులు పదోన్నతులు పొందుతున్నా.. మాలో చాలామంది అన్యాయానికి గురయ్యారు. గ్రేడ్ -2 భాషాపండితులుగానే ఉద్యోగంలోకి వచ్చి, అదే పోస్టుల్లో రిటైర్మెంట్ అయినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. తక్కువ హోదాలో, తక్కువ జీతానికి వెట్టిచాకిరి గురయ్యాం. ఈ కేసులో డివిజన్ బెంచ్లో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులకు ధన్యవాదాలు. విద్యాశాఖ ఈ తీర్పును అమలుచేసి, వెంటనే భాషాపండితులకు గ్రేడ్ -1 పదోన్నతులు కల్పించాలి.
– గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ, ఆర్యూపీపీ, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
త్వరగా పదోన్నతులు కల్పించాలి
అపార బోధనానుభవం ఉన్న గ్రేడ్ -2 భాషాపండితులకు పదోన్నతులు దక్కలేదు. భాషాపండితులు కాని వారు కూడా పాఠాలు బోధించడంతో విద్యార్థులు నష్టపోయిన సందర్భాలున్నాయి. కొంతమంది మాకు న్యాయంగా దక్కాల్సిన వాటిని అడ్డుకొన్నారు. మేం కోర్టునాశ్రయించడంతో మాకిప్పుడు న్యాయం జరిగింది. ఎట్టకేలకు హైకోర్టు చరిత్రాత్మక తీర్పునివ్వడం శుభసూచకం. విద్యాశాఖ వీలైనంత త్వరగా పదోన్నతులు కల్పించాలి.
– సీ జగదీశ్, ఆర్యూపీపీ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు