హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): హనుమకొండ సుబేదారి పోలీసుస్టేషన్లో సీఐగా విధులు నిర్వహించిన వీ సురేశ్పై 2012లో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) నమోదుచేసిన కేసు సరైనదేనని హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. తెలంగాణ ఉద్యమం ఉధృతం గా ఉన్న సమయం 2012, డిసెంబర్ 21న కాకతీయ ఉత్సవాల ప్రారంభానికి వస్తున్న నాటి సీఎం కాన్వాయ్ని అడ్డుకొనేందుకు కుట్ర పన్నారని నాటి టీఆర్ఎస్ కార్యకర్తలు జే రమేశ్, వాసుదేవరెడ్డి, దర్శన్సింగ్, అనిల్, సంకు నరసింగరావు, వై రాజేంద్రయాదవ్తోపాటు మరికొందరిని సీఐ సురేశ్ అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరచకపోవడం తో..వారి స్థితిగతులను తెలుసుకొనేందుకు ఒక అడ్వకేట్ కమిషన్ను ఏర్పాటుచేసి, తనిఖీకి వారంట్ జారీ చేయాలని కోరు తూ.. అబ్దుల్నబీ అనే న్యాయవాది వరంగల్ సీజేఎం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సీజేఎం..
న్యాయవాదులు కే రమేశ్, ఎం రవీందర్ ను అడ్వకేట్ కమిషనర్లుగా నియమించారు. కోర్టు ఆదేశాలతో ఈ ఇద్దరు పోలీస్స్టేషన్కు వెళ్లగా సీఐ సురేశ్తోపాటు ఇతర పోలీసులు వారిని అడ్డుకోవడమే కాకుండా స్టేషన్ వదిలి వెళ్లాలని ఒత్తిడి చేశారు. దీంతో అడ్వకేట్ కమిషనర్లు తాము ఎదుర్కొన్న పరిస్థితులను నివేదిక రూపంలో సీజేఎంకు తెలియపరిచారు. అదేరోజు రాత్రి 10.55కు సీఐ సురేశ్ తమ అదుపులో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలను సీజేఎం కోర్టులో హాజరుపరిచారు. అప్పటికే అడ్వకేట్ కమిషనర్ నివేదిక అందుకున్న సీజేఎం సీఐ సురేశ్పై సుమోటోగా కేసు నమోదుచేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ సురేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు.. కోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్లు పబ్లిక్ సర్వెంట్లని పేర్కొన్నది. వారిని అడ్డుకోవడం అధికారిక విధులను ఆటంకపరచడమేనని స్పష్టంచేసింది. అడ్వకేట్ కమిషన్ను అడ్డుకున్న సీఐపై చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు కేసు నమోదు చేయడం చట్టబద్ధమేనని స్పష్టంచేసింది.