హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన అధికారాల పరిధి ఎంతవరకు ఉన్నదన్న అంశంపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ జరుపనున్నది. రాజ్యాంగంలోని 162, 15(3) అధికరణల కింద ప్రభుత్వం చేపట్టే సంక్షేమ చర్యలపై డివిజన్ బెంచ్ ప్రధానంగా దృష్టి సారించనుంది. ఈ పథకాల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ సోమవారం విచారణకు వచ్చింది.
అప్పీలుకు నంబర్ కేటాయించే విషయంలో రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం తోసిపుచ్చింది. అప్పీలుకు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దీంతో ప్రధాన అప్పీలుపై మంగళవారం విచారణకు మార్గం సుగమమైంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి 2014 నుంచి ప్రభుత్వం జారీచేసిన ఎనిమిది జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్గోపాల్ వ్యక్తిగత హోదాలో హైకోర్టును ఆశ్రయించారు.