హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి జైలుపాలైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది. రాజాసింగ్ను మొదట అరెస్టు చేసినప్పుడు రిమాండ్కు తరలించేందుకు కింది కోర్టు తిరసరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ మంగళహాట్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారించింది. సీఆర్పీసీ సెక్షన్ 41 కింద ముందుగా నోటీసు ఇవ్వలేదన్న కారణంతో రాజాసింగ్ను రిమాండ్కు ఇచ్చేందుకు 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిరాకరించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీ ప్రతాప్ గుర్తుచేశారు. రిమాండ్ రిపోర్టులోని అంశాలను కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, దర్యాప్తు అధికారి నివేదికను పట్టించుకోలేదని ధర్మాసనానికి విన్నవించారు. రాజాసింగ్పై 12 కేసులున్నాయని, 2006లో రౌడీషీట్ కూడా తెరిచారని తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ రాజాసింగ్ శాంతిభద్రలకు విఘాతం కలిగిస్తున్నారని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు రాజాసింగ్కు నోటీసులు జారీచేస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది.